నిజాంపేట, జనవరి 28: పూర్వం రోజుల్లో రైతు లు ఒక వైపు ఒక రకం పంట మరో వైపు వేరొక పం టను వేస్తూ పంట మార్పిడి విధానాన్ని అవలంబించేవారు. వానకాలం, యాసంగిలోనూ ఒకే రకం (వరి) పం టసాగు చేయడంతో ఇతర పంటల సాగు క్రమేపి తగ్గుతూ వచ్చింది. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, అందుకు తగిన ఏర్పాట్లను ప్రభు త్వం ఏర్పాటు చేస్తున్నది. వానకాలంలో వరి పంట ను సాగు చేసిన రైతులు యాసంగిలో తరువాత పంట కోసం కొంతమంది రైతులు వరి కొయ్యలను కాల్చి పర్యావరణానికి హాని తలపెడుతూ దున్నకం పనులు చేపట్టి పంటకు పెట్టుబడి భారం దినదినం పెంచుకుంటున్నారు. ఈ సమస్య పరిష్కారా నికే వ్యవసాయశాఖ జీరో టిల్లేజ్ పద్ధతి(వరి కొయ్యలను దున్నకుండా పంటలను సాగు చేయు విధానం)పై రైతులకు అవగాహన కల్పిస్తున్నది. జీరో టిల్లేజ్ పద్ధతిలో రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక ఆదా యం లభిస్తున్నది. నిజాంపేట మండలంలోని వెంకటాపూర్(కె) గ్రామానికి చెందిన యువరైతు అనిల్ కుమార్ జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నాడు.
జీరో టిల్లేజ్ పద్ధతిపై అవగాహనకల్పించారు..
తక్కువ పెట్టుబడులతో పంటలను సాగు చేయు వివిధ రకాల పద్ధ తులపై వ్యవసాయ అధికారులు మా గ్రామానికి వచ్చి అవగాహన కల్పించారు. అందులో జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు విధా నం బాగుందని యాసంగికి నా వ్యవసాయ పొలంలో 2.20ఎకరాల మేర మొక్కజొన్న పంటను వేశాను. వ్యవసాయ అధికారుల సూచనలు మేరకు ఎరువుల యాజమాన్య పద్ధతులను పాటిస్తూ మొక్కజొన్న పంటను సాగుచేస్తున్న. ప్రస్తుతం పంటకు
తగ్గట్టుగా నీటి తడులను అం దిస్తున్నా. ఆశించిన స్థాయిలో పంట దిగుబడి వచ్చేట్టు ఉంది.
– అనిల్కుమార్, రైతు, వెంకటాపూర్(కె)
జీరో టిల్లేజ్ పద్ధతి రైతులకు లాభదాయకం
ఆరుతడి పంటలైన కంది, వేరుశనగ, సన్ఫ్లవర్, జొన్నలు, మినుములు వంటి పంటలను సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నాము. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు వచ్చే జీరో టిల్లేజ్ పద్ధతిపై రైతులకు అవగాహన కల్పించాము. వరి కొయ్యలను దున్నకుండా అందులోనే ఇతర పంటలను సాగుచేయడం వల్ల దున్నకం ఖర్చులు రైతుకు మిగులుతాయి. ఈ పద్ధతి రైతులకు లాభదాయకంగా మారనుంది. నిజాంపేటతో పాటు వెంకటాపూర్(కె) గ్రామాల్లో ఈ పద్ధతిలో కొంతమంది రైతులు మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు.
– సతీశ్, మండల ఏవో, నిజాంపేట
1. తక్కువ పంటకాలం ఉండటం వల్ల తక్కువ సమయంలో పంట కోత దశకు వస్తుంది. ఇతర జీవుల వల్ల పంటకు ఎటువంటి నష్టం వాటిల్లదు.
2. ఈ పద్ధతిలో వరి కొయ్యలు కుళ్లి సేంద్రియ పదార్థంగా మారి మొక్కజొన్న పంటకు ఎరువుగా పనిచేస్తుంది. దీంతో పంట ఏపుగా పెరిగి దిగుబడి అధికంగా వస్తుంది.
3. సాధారణ పద్ధతిలో ఒక ఎకరం మేర వరి కొయ్యలు ఉన్న పొలంలో మొక్కజొన్న పంటను సాగు చేయాలంటే దున్నకానికి రూ. 1500 లు పెట్టుబడి ఖర్చు వస్తున్నది. కానీ జీరో టిల్లేజ్ పద్ధతిలో దున్నకం పనులు ఉండవు కాబట్టి పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చు.
4. ఈ పద్ధతి ద్వారా ఒక ఎకరంలో వరి పంటను సాగు చేయడానికి అవసరమైన నీళ్లతో రెండు ఎకరాల వరకు మొక్కజొన్న సాగు చేయవచ్చు.
5. ఈ పద్ధతిలో మొక్కజొన్న పంటను సాగు చేయడం వల్ల ఒక ఎకరానికి 40-50 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చు.