గజ్వేల్, జనవరి 30: బీఆర్ఎస్ సర్కారు హయాంలో కేటాయించిన ఇండ్లను తమకు అప్పగించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మంగళవారం రెండు గంటల పాటు లబ్ధిదారులు ఆందోళన చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ సమీపంలో బీఆర్ఎస్ సర్కారు నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో అర్హులను ఎంపిక చేసి లక్కీ డ్రా పద్ధ్దతిలో 1100 మందిని ఎంపిక చేశారు. కాగా, వాటిని మల్లన్నసాగర్ ముంపు గ్రామాలకు చెందిన వారికి తాత్కాలికంగా కేటాయించారు. లక్కీ డ్రాలో కేటాయించిన ఇండ్లను తమకు అప్పగించాలపి లబ్ధిదారులు రెండు గంటల పాటు ఆందోళన చేపట్టగా ట్రాఫిక్ జాం అయ్యింది.
గజ్వేల్ ఏసీపీ రమేశ్ సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకుని లబ్ధిదారులకు నచ్చజెప్పారు. వారు వినకపోవడంతో ఆర్డీవో బన్సీలాల్, తహసీల్దార్ బాల్రాజు చేరుకుని సముదాయించారు. పూర్తి విచారణ చేసి లక్కీడ్రాలో కేటాయించిన వారికి ఇండ్లు కేటాయిస్తామని ఆర్డీవో చెప్పినప్పటికీ వినకుండా ఆందోళన చేశారు. రెండు గంటల పాటు ఆందోళనతో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మార్గంలో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. అధికారలు మరోసారి సముదాయించడంతో ఆందోళనకారులు విరమించారు.వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఆర్టీసీ వాహనాలను క్లియర్ చేశారు. సీఐలు సైదా, లతీఫ్, మహేందర్రెడ్డి, తిరుపతి, ఎస్సైలు బందోబస్తులో పాల్గొన్నారు.