మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 24: క్రిస్మస్ పండుగకు చారిత్రాత్మక మెదక్ చర్చి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. లోక రక్షకుడు ఏసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్ఐ చర్చిలో ఆదివారం తెల్లవారుజాము నుంచి వైభవంగా నిర్వహించనున్నారు. ప్రపంచంలోనే మెదక్ చర్చికి ప్రత్యేకత ఉంది. అద్భుతమైన కళాకృతులతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మించారు. క్రిస్మస్ వేడుకకు లక్షలాది మంది భక్తుల రానుండడంతో మెదక్ డయాసిస్ మిషనరీ ప్రతినిధులు, అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయనుండగా నేటి తెల్లవారుజాము నుంచే చర్చి ద్వారాలను తెరిచి ఉంచుతారు. ఉదయం 4.30 గంటలకు మొదటి ఆరాధన నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి బిషప్ రెవరెండ్ ఏసీ సాలోమన్రాజ్ ముఖ్యఅతిథిగా హాజరై భక్తులనుద్దేశించి వ్యాక్యోపదేశం చేస్తారు. అనంతరం 9.30 గంటలకు రెండో ఆరాధనలో చర్చి ప్రెసిబెటరీ ఇన్చార్జి రెవరెండ్ జార్జి ఎబినైజర్ రాజు దైవసందేశం చేయనున్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు పాస్టర్లు భక్తులకు దీవెనలు అందజేస్తారు. ఇందుకోసం సికింద్రాబాద్ వేద కళాశాల నుంచి పాస్టర్లు రానున్నారు. క్రిస్మస్ వేడుకలకు మెదక్ డయాసిస్ పరిధిలోని పాత ఉమ్మడి జిల్లాలైన మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన క్రైస్తవ సోదరులకే కాకుండా మతాలకతీతంగా పొరుగు రాష్ర్టాలైన ఆంధ్రా, కర్ణాటక, మహారాష్ట్రతో నుంచి భారీ సంఖ్యలో భక్తులు, సందర్శకులు తరలిరానున్నారు. విదేశాల నుంచి సైతం పర్యాటకులు, భక్తులు హాజరై చర్చిని సందర్శిస్తారు. తొలిరోజు లక్ష మంది వరకు భక్తులు రావొచ్చని డయాసిస్ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు.
వసతి సౌకర్యాలు
సీఎస్ఐ చర్చికి వచ్చే సందర్శకుల సౌకర్యార్థం వసతి గృహాల మేనేజర్ జాయ్ముర్రే అధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వెస్లీ కళాశాల, గోల్బంగ్లా, సండే స్కూల్, బిషప్ బంగ్లా, పర్యాటక అతిథి గృహంతో పాటు సీఎస్ఐ వసతి గృహాలను సిద్ధం చేశారు. తాగునీటి సమస్య ఉత్పన్న కాకుండా చర్చి పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ ఆధ్వర్యంలో నీటి ట్యాంకులను ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్య సేవల కోసం జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో నిమిత్తం ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు.
కాంతులు విరజిమ్ముతున్న చర్చి
క్రిస్మస్ పండగను పురస్కరించుకొని చర్చి ప్రతినిధులు మహాదేవాలయ ప్రాంగణం, పరిసరాలను అందంగా అలంకరించారు. రంగురంగుల విద్యుద్దీపాల అలంకరణలతో చర్చి కొత్త కాంతులను విరజిమ్ముతోంది. ఏసుక్రీస్తు జన్మవృత్తాంతాన్ని తెలిపే పశువుల పాక, క్రిస్మస్ ట్రీ, పునరుత్థానానికి చిహ్నంగా ఏర్పాటు చేసిన నక్షత్రాలతో మహా దేవాలయం కొత్త శోభ సంతరించుకుంది.
ప్రత్యేక బస్సులు
జిల్లాలోని పలుప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు మెదక్ డిపో మేనేజర్ రవిచందర్ తెలిపారు. సికింద్రాబాద్ జూబ్లీ బస్స్టేషన్, ఎల్లారెడ్డి, నర్సపూర్, బొడ్మట్పల్లి నుంచి అదనంగా బస్సులు నడుపుతామన్నారు. ఏఏ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది భక్తులు చర్చికి వస్తారో ఆ ప్రాంతాల నుంచి ఎక్కువ బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
భక్తులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు.. మున్సిపల్ కమిషనర్ జానకీరామ్ సాగర్
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మెదక్ మున్సిపల్ చైర్మన్ కమిషనర్ జానకీరామ్ సాగర్ తెలిపారు. మూడు రోజులుగా పారిశుధ్య సిబ్బందితో చర్చి పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించినట్లు తెలిపారు. చర్చి ప్రాంతంలో దుమ్మూ, దూళి లేకుండా ట్యాంకర్లతో నీటిని చల్లిస్తున్నట్లు తెలిపారు. తాగునీటి కోసం నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేయించామన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని మున్సిపల్ ఆధ్వర్యంలో ఎల్ఈడీ లైట్లు చర్చి ఆవరణలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వేడుకల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి
క్రిస్మస్ వేడుకల్లోఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి పాల్గొనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చర్చిలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం చర్చి ప్రధాన ద్వారం ఎదుట మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, సీఎస్ఐ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేయనున్నట్లు మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్చైర్మన్ మల్లికార్జున్గౌడ్ తెలిపారు. అనంతరం భక్తులకు కేక్లను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
మెర్రీ క్రిస్మస్..క్రైస్తవులకు మంత్రి హరీశ్రావు శుభాకాంక్షలు
క్రైస్తవులకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమభావాన్ని, సేవాతత్పరతను, క్షమాగుణాన్ని బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అని మంత్రి అన్నారు. ఆనందోత్సవాలతో ఈ పర్వదినాన్ని జరుపుకోవాలన్నారు. పండుగ సందర్భంగా పేద క్రిస్టియన్లకు ప్రభుత్వం కానుకలు ఇచ్చిందని చెప్పారు. ప్రభువు దీవెనలతో సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశ స్థాయిలో అమలయ్యేలా, దేశస్థాయిలో బీఆర్ఎస్ గుణాత్మకమైన మార్పులు తెచ్చేలా ఆశీర్వదాలు ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ పర్వదినంలో కైస్తవ సోదరులకు అందరూ సుఖ సంతోషాలతో వేడుకగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
మెదక్ చర్చి జిల్లాకే తలమానికం:ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి
క్రైస్తవ సోదర, సోదరీమణులకు సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు ప్రవచించిన ప్రేమ, కరుణ, శాంతి, త్యాగం అనే సుగుణాలను పాటిస్తే అందరి జీవితాలు సుఖశాంతులతో నిండుతాయని అన్నారు. కరువు కాలంలో దేవుని గుడి నిర్మించి పేద ప్రజల ఆకలి తీర్చిన చరిత్ర మెదక్ చర్చి నిర్మాణ దాతలకు ఉందని కొనియాడారు. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న మెదక్ చర్చి మన జిల్లాకే తలమానికమన్నారు. ఆనందోత్సాహాలతో ఈ పర్వదినాన్ని వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
సుఖసంతోషాలు నిండాలి సంగారెడ్డి కలెక్టర్ శరత్
ప్రపంచ సర్వమత శాంతి స్థాపన కోసం పుట్టిన మహనీయుడు, శాంతిదూత ఏసుక్రీస్తు అని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. క్రిస్మస్ పండగను పురస్కరించుకొని శనివారం జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు శత్రువులను మిత్రులుగా మార్చుకుని శాంతి మార్గం చూపారని, ఆయన అందరికీ ఆదర్శనీయమని తెలిపారు. జిల్లాలో క్రైస్తవ సోదర, సోదరీమణులందరూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. వారి కుటుంబాల్లో సుఖ సంతోషాలు నిండాలని ఆకాంక్షించారు.