హుస్నాబాద్, ఆగస్టు 25: కాకతీయుల కాలంలో నిర్మించిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువుకు మహర్దశ పట్టింది. సమైక్యపాలనలో నిర్లక్ష్యానికి గురైన చెరువు 2014 అనంతరం అభివృద్ధికి నోచుకుంటున్నది. ఎల్లమ్మచెరువు నిండి మత్తడి దుంకిందంటే హుస్నాబాద్ ప్రాంతంలో సమృద్ధిగా వర్షాలు కురిసినట్లేనని ఈ ప్రాంత ప్రజలు, రైతుల నమ్మకం. ఈ ప్రాంతంలోనే అతిపెద్దదైన ఎల్లమ్మ చెరువును చూసేందుకు ఇప్పటికే పర్యాటకులు నిత్యం వస్తుంటారు. నిండుగా ఉన్న చెరువును, చెరువు కింద సాగయిన పచ్చని పంటలు, ఆ పక్కనే ఉన్న సిద్ధేశ్వర గుట్టను చూసి ఆహ్లాదాన్ని పొందుతున్నారు. శిథిలావస్థకు చేరి పెద్ద పెద్ద వృక్షాలతో అల్లుకుపోయిన కట్ట, పాడైపోయిన తూములతో ఉన్న చెరువుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ కృషితో పెద్దఎత్తున నిధులు కేటాయించడం వల్ల కొత్త రూపును సంతరించుకుంటున్నది. మినీట్యాంక్బండ్గా మార్చేందుకు, సుందరీకరణకు నిధులు మంజూరయ్యాయి. పనులు శరవేగంగా జరుగుతుండడంతో ఎల్లమ్మ చెరువు త్వరలోనే మంచి పర్యాటక ప్రాంతంగా మారుతుందని ఈ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్లకు, ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్కు ప్రజలు ధన్యవాదాలు చెబుతున్నారు.
హుస్నాబాద్లోని ఎల్లమ్మచెరువును మినీ ట్యాంక్బండ్గా మార్చేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.10కోట్ల నిధులు మంజూరు చేసింది. కట్ట, తూముల మరమ్మతులు, పూడికతీత పనులు రూ.6.50కోట్లతో పూర్తయ్యాయి. ఇటీవల కట్ట సుందరీకరణ కోసం మరో రూ.3.50కోట్ల నిధులు కూడా మంజూరయ్యాయి. ఎల్లమ్మ చెరువును అప్పటి భారీ నీటి పారుదల శాఖమంత్రి తన్నీరు హరీశ్రావు స్వయంగా సందర్శించిన మినీట్యాంక్ బండ్గా మార్చుతామని హామీ ఇచ్చారు. 2017లో రూ.6.50కోట్ల నిధులను కేటాయించి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.3.50కోట్లతో చేపట్టబోయే సుందరీకరణ పనులకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. దీంతో సుందరీకరణ పనులు ఇటీవల ప్రారంభమై ముమ్మరంగా జరుగుతున్నాయి.
పర్యాటకులను ఆకర్షించడంతో పాటు పట్టణవాసులు నిత్యం వాకింగ్, జాగింగ్ చేసేందుకు వీలుగా ఎల్లమ్మచెరువు మినీ ట్యాంక్ బండ్పై వివిధ రకాల సుందరీకరణ పనులు చేపడుతున్నారు. చిల్డ్రన్స్ పార్కు, బోటింగ్, లైటింగ్ సిస్టం, వాకింగ్ ట్రాక్, బతుకమ్మ ఘాట్ల నిర్మాణం చేయనున్నారు. పర్యాటకుల కోసం కట్ట మొత్తం వివిధ రకాల పూలమొక్కలు, డిజైన్ మొక్కలను పెంచనున్నారు. గౌరవెల్లి రిజర్వాయర్కు చెరువును అనుసంధానం చేయనుండడంతో నిత్యం నిండుగా నీళ్లు ఉండే అవకాశం ఉంది. దీంతో బోటింగ్ నిరంతరం నడవనున్నది. పర్యాటక శాఖ చేపట్టిన సుందరీకరణలో భాగంగా చేసే పనులు.
సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ కృషితోనే నియోజకవర్గంలో అతి పెద్దదైన హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు అభివృద్ధికి నోచుకుంటున్నది. 2014కు ముందు ఈ చెరువును ఎవరూ పట్టించుకోలేదు. మంత్రి హరీశ్రావు స్వయంగా ఎల్లమ్మ చెరువును సందర్శించి మినీ ట్యాంక్బండ్గా మార్చుదామని హామీనిచ్చి నిధులు కేటాయించారు. పర్యాటక శాఖ నుంచి నిధులు మంజూరయ్యాయి. సాధారణ చెరువుగా ఉన్న ఎల్లమ్మచెరువు త్వరలో మినీ ట్యాంక్బండ్గా రూపుదిద్దుకొని పర్యాటకులకు నెలవుగా మారబోతున్నది. హుస్నాబాద్ పట్టణ ప్రజలకే కాకుండా నియోజకవర్గంలోని పలు మండలాల ప్రజలకు ఎల్లమ్మ చెరువు ఆహ్లాదాన్ని పంచనున్నది. నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రులకు కృతజ్ఞతలు.
– వొడితెల సతీశ్కుమార్, ఎమ్మెల్యే, హుస్నాబాద్
ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్బండ్ పనులు పూర్తయితే హుస్నాబాద్ పట్టణ రూపురేఖలే పూర్తిగా మారిపోతాయి. ఇప్పటివరకు హుస్నాబాద్కు పార్కుగానీ, పర్యాటక ప్రదేశం గానీ లేదు. ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ కృషితో మహర్దశ పట్టింది. సుమారు రూ.10కోట్ల నిధులతో ఎల్లమ్మచెరువు మినీ ట్యాంక్బండ్గా మారబోతుంది. పర్యాటకుల సంఖ్య పెరగడం వల్ల హుస్నాబాద్ పట్టణంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు కూడా పెరుగుతాయి. ముందుచూపుతో ఎల్లమ్మ చెరువు అభివృద్ధికి కృషి చేసిన ఎమ్మెల్యే సతీశ్కుమార్కు కృతజ్ఞతలు. హుస్నాబాద్ ప్రాంత ప్రజలు
ఆయనకు ఎల్లవేళలా రుణపడి ఉంటారు.
– రజితావెంకట్, చైర్పర్సన్, హుస్నాబాద్ మున్సిపాలిటీ