సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 17: జిల్లాలో ఆర్థిక మద్దతు పథకాల లక్ష్య సాధనకు సహకరించాలని బ్యాంకర్లతో జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బ్యాంక ర్లు, జిల్లా అధికారులతో రైతులు, స్వయం సహాయక సంఘాల రుణాలు, రికవరీ, పీఏంజీపీవై రుణాలు, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల పథకాలకు సంబంధించి రుణ లక్ష్యం పురోగతిపై డీసీసీ, డీఎల్ఆర్సీ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భం గా రాజర్షి షా మాట్లాడుతూ ఆర్థిక మద్దతు పథకాలకు సంబంధించి 100 శాతం లక్ష్య సాధనకు బ్యాంకర్లు, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. రైతులు తమ రుణాలను రెన్యువల్ చేసుకునే అంశంపై వారికి అవగాహన కల్పించాలని, జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో బ్యాంకర్లు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతుబంధు, రైతుబీమా, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధులను పంట రుణాలకు జమ చేసుకునేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. సదరు నియమాలను బ్యాంకర్లు విధిగా పాటించాలన్నారు. రూ.1473 కోట్ల పంట రుణా లు లక్ష్యం కాగా, రూ.1393 కోట్లు, స్వయం సహాయక సంఘాలకు రూ.605 కోట్లకు, మెప్మా కింద 858 స్వయం సహాయక సంఘాలకు రూ.73 కోట్ల రుణాలు అందించినట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉన్న లక్ష్యాల్లో 64.52 శాతం పూర్తయ్యిందన్నారు. పెండింగ్లో ఉన్న రుణాల ప్రతిపాదనలు సైతం బ్యాంకర్లకు అందించి, త్వరగా మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని రాజర్షి షా ఆదేశించారు. జిల్లాలో రుణాల రికవరీపై శ్రద్ధ చూపాలన్నారు. యువతకు ఉపాధి అందించే విషయంలో అధికారులు చొరవ చూపాలని బ్యాంకర్లకు సూచించారు. అనంతరం నాబార్డుకు సంబంధించిన 2023-24 జిల్లా పొటెన్షియల్ లింక్డ్ ప్లాన్ పుస్తకాన్ని రాజర్షి షా ఆవిష్కరించారు. సమావేశంలో ఎల్డీఎం గోపాల్రెడ్డి, ఆర్బీఏం ఏజీఎం అలీబాబా, జిల్లా వ్యవసాయ, పశు సంవర్ధక, పరిశ్రమలు, జిల్లా గ్రామీణాభివృద్ధి, మెప్మా, ఆయా సంక్షేమ శాఖల అధికారులు, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.