శివ్వంపేట, ఫిబ్రవరి 10: దేశంలోనే ప్రప్రథమంగా నిర్మించిన బగలాముఖి శక్తిపీఠం విగ్రహ ప్రతిష్ఠతో దివ్యక్షేత్రంగా మారనుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్రెడ్డి, యాదవరెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డిలు అన్నారు. శివ్వంపేటలో ఈనెల 8నుంచి బగలాముఖి అమ్మవారి ఉపాసకులు, శక్తిపీఠం ట్రస్టు చైర్మన్ శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో ప్రారంభమైన దశ మహావిద్యల్లోని బగలాముఖి శక్తిపీఠం 10వ తేదీ 10గంటల 10 నిమిషాలకు విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంతో పాటు గోపూజ, అఘోర వ్యాహృతి హోమం, పూర్ణాహుతి వంటి ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాలకు హాజరైన నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్రెడ్డి, యాదవరెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, జడ్పీచైర్పర్సన్ హేమలతా, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డిలు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా మండల కేంద్రమైన శివ్వంపేటలో శక్తిపీఠం కొలువుదీరడం మన అదృష్టమని అన్నారు. రానున్న రోజుల్లో బగలాముఖి శక్తిపీఠం గొప్ప పర్యాటక కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమ్మవారి ఉపాసకులు శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ సంకల్పం, ఆలయ స్థలదాతలు పబ్బరమేశ్గుప్తా, పబ్బ మహేశ్గుప్తాల సేవా దృక్పథం, దాతల సహకారంతో శక్తిపీఠాన్ని నిర్మించారన్నారు. అమ్మవారి దయతో సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అన్నారు.
అమ్మవారి దివ్యదర్శనం
మూడో రోజు శుక్రవారం విగ్రహ ప్రతిష్ఠలో భాగంగా అమ్మవారి ఉపాసకులు శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో దాదాపు 200 వేదపండితులు, రుత్వికులు వేదమంత్రోచ్ఛారణల మధ్య జలాభిషేకం, పసుపాభిషేకం చేసి, అమ్మవారి దివ్యదర్శనం కల్పించారు. వేదపండితులు, రుత్వికులు చేసిన వేదఘోశతో శివ్వంపేట ప్రాంతం పులకరించిపోయింది. దాదాపు 10వేలకు పైగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త అశోక్జైన్ ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొన్నారు.
ఆకట్టుకున్న కేరళ డోలువాయిద్యాలు
బగలాముఖి విగ్రహప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా శక్తిపీఠం ట్రస్టు సభ్యులు కేరళ డోలు వాయిద్యం ఏర్పాటు చేశారు. పూజలు, ముఖ్య అతిథుల ఆహ్వానాల సందర్భంగా కేరళ డోలు వాయిద్యాలు వాయించిన తీరు భక్తులను ఆకట్టుకున్నాయి.
ట్రస్టు సభ్యుల ఆధ్వర్యంలో సకల సదుపాయాలు
మూడు రోజులుగా జరిగిన బగలాముఖి శక్తిపీఠం ప్రతిష్ఠా మహోత్సవాలకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బగలాముఖి శక్తిపీఠం ట్రస్టు సభ్యులు హైకోర్టు సీనియర్ న్యాయవాది శివకుమార్గౌడ్, జడ్పీటీసీ పబ్బమహేశ్గుప్తా, సర్పంచ్ పత్రాల శ్రీనివాస్గౌడ్, వెంకటరమణశర్మ, పురుషోత్తంశర్మ అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్య అతిథులతో పాటు వలంటీర్లను ట్రస్టు సభ్యులు అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ ఎలక్షన్రెడ్డి, శక్తిపీఠం స్థలదాత పబ్బరమేశ్గుప్తా, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కో ఆప్షన్ మన్సూర్, రాష్ట్ర నాయకుడు శ్రీధర్గుప్తా, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు రమణాగౌడ్, వేణుగోపాల్రెడ్డి,
సుధీర్రెడ్డి, వివిధ పార్టీల నేతలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, శివ్వంపేట పంచాయతీ
పాలకవర్గం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.