మెదక్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ప్రతి ఓటర్కు ఓటరు స్లిప్పులు అందేలా కార్యాచరణ అమలు చేయాలని రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. మంగళవారం సీఈవో కార్యాలయం హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి వెబ్ క్యాస్టింగ్ నిర్వహణ, ఓటరు స్లిప్పుల పంపిణీపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఈ సమావేశంలో మెదక్ జిల్లా నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షిషా, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ నిర్వహణకు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. దీనికి అవసరమైన మేరకు యంత్రాంగం సిద్ధం చేసుకోవాలని సూచించారు. స్థానికంగా అందుబాటులో ఉండే కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న యువతను వెబ్ క్యాస్టింగ్ కోసం వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఓటరు స్లిప్పులు అందలేదని, గతంలో అనేక ఫిర్యాదులు ఉన్నాయని, వీటి నివారణకు ఎన్నికల కమిషన్ ముందస్తుగా ఓటరు స్లిప్పుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించిందన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు స్లిప్పులు ముద్రించి, పకడ్బందీగా వాటిని పంపిణీ చేసేలా చర్య లు తీసుకోవాలన్నారు.
ఓటరు స్లిప్పుల పంపిణీ పర్యవేక్షణ కోసం నోడల్ అధికారులను నియమించుకోవాలని తెలిపారు. ఓటరు స్లిప్పుల పంపిణీలో ఫిర్యాదులుంటే వాటి పరిషారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీ షెడ్యూల్ను రాజకీయ పార్టీల ప్రతినిధులకు ముందస్తుగా తెలపాలని, బీఎల్ఏలను ఓటరు స్లిప్పుల పంపిణీలో భాగస్వామ్యం చేయాలన్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీపై రోజూ నివేదికలు సమర్పించాలన్నారు. ప్రతీ ఓటరుకు తప్పనిసరిగా ఓటరు స్లిప్పు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు జాబితాపై వచ్చిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యల వివరాల రిజిస్టర్ను కట్టుదిట్టంగా నిర్వహించాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, వారి అనుచరులకు సి-విజల్ యాప్పై అవగాహన కల్పించాలని సూచించారు. సి-విజల్ యాప్ను విస్తృతంగా వినియోగించడంతో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ, కోడ్ ఉల్లంఘనలను అరికట్టేందుకు ఉపయోగపడుతుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో పా ల్గొన్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ.. జిల్లాలోని 34-మెదక్ , 37 నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ముద్రణ పూర్తయ్యిందని, పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఈడీఎం సందీప్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
మెదక్ అర్బన్, నవంబర్14: ఎన్నికల నియామావళిలో భాగంగా మంగళవారం ఐడీఓసీలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను సాధారణ, వ్యయ, పోలీస్ పరిశీలకుడు సంతోష్కుమార్ తుకారం పరిశీలించారు. అనంతరం జిల్లాలో చెక్పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల రికార్డింగ్ పనితీరును, సీ విజిల్లో వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారాలు, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ టీమ్ పనితీరు మీడియాలో వచ్చే వార్తలు, పేయిడ్ న్యూస్, పత్రికప్రకటనలు, ఎలక్ట్రానిక్ మీడియా రికార్డింగ్ పనితీరును జిల్లా ఎన్నికల అధికారి వివరించారు. కలెక్టర్ను నియోజకవర్గంలో ఉన్న బ్యాంకు అకౌంట్ సమాచారం, ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు జమైన వారి అకౌంట్ సమాచారం, వాటి వివరాలు, జీఎస్టీ అకౌంట్లా వివరాలు, ఇప్పటివరకు సీజ్ అయిన డబ్బు, మద్యం, నమోదైన కేసుల వివరా లు, అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా, ఎస్పీ రోహిణిప్రియదర్శిని, జిల్లా అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేశ్ తదితరులు ఉన్నారు.