కంది, మార్చి 27: సీపీఆర్పై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులకు నిర్వహించిన సీపీఆర్ శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చోటు చేసుకుంటున్న అకాల మరణాలు బాధాకరమన్నారు.
గుండెపోటు, సడెన్ కార్డియాక్ అరెస్టుతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ ప్రాణనస్టాన్ని తగ్గించేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా సీపీఆర్పై అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. మొదటి శిక్షణ కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లాలో ప్రారంభించుకున్నామన్నారు. ప్రతి జిల్లాకు ఐదుగురు మాస్టర్ ట్రైనర్లను నియమించి సీపీఆర్పై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా జిల్లా, మండల, గ్రామ స్థాయిలో సీపీఆర్పై అవగాహన కల్పించాలని సూచించారు. మన శరీరంలో అన్ని భాగాలకు విశ్రాంతి ఉంటుంది.
కానీ, గుండెకు మాత్రం ఉండదని, మనం నిద్రిస్తున్నా మన గుండె పనిచేస్తూనే ఉంటుందన్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న గుండెలు అకస్మాత్తుగా ఆగిపోతున్నాయని, సడెన్ కార్డియాక్ అరెస్టులు, హార్ట్స్ట్రోక్లు పెరిగిపోతున్నాయని, కళ్లముందే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూస్తున్నామని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. జంక్ఫుడ్, ఆయిల్ ఫుడ్కు దూరంగా ఉంటూ వ్యాయామం, యోగాలాంటివి దినచర్యలో భాగం చేసుకొని ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఎస్పీ రమణకుమార్, ఆర్డీవో నగేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.