రాయపోల్, ఏప్రిల్ 13: సాగునీటి సరఫరా కోసం అధికారులు కాలువలు తవ్వించారు. కానీ, ప్రజలు కాలువ దాటేందుకు వంతెన నిర్మించడం మరిచిపోయారు. దీంతో అటువైపు వెళ్లేవారు సర్కస్ ఫీట్ చేయాల్సి వస్తున్నది. కొండపోచమ్మ సాగర్ నుంచి మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్కు సాగు నీటిని సరఫరా చేసేందుకు దౌల్తాబాద్ మండలం అప్పాయపల్లి మీదుగా కాలువ నిర్మించారు. అప్పాయపల్లి గ్రామానికి చెందిన రైతుల పొలాలు కాలువల అవతలి వైపు ఉన్నాయి.
ఆ పొలాలకు వెళ్లేందుకు గతంలో దారి ఉండేది. కాలువ నిర్మాణం పూర్తి కావడంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు తీవ్ర అడ్డంకిగా మారింది. కాలువ నిర్మాణ సమయంలో పొలాలకు వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు, కాంట్రాకర్కు రైతులు మొరపెట్టుకున్నారు. కాలువపైన అవసరమైన చోట బ్రిడ్జిలు నిర్మిస్తామని అధికారులు,కాంట్రాక్టర్ గ్రామ రైతులకు హామీ ఇచ్చారు.
కానీ, కాలువ నిర్మాణం పూర్తిచేసి వంతెనలు నిర్మించకుండా వదిలేశారు. దీంతో ప్రతిరోజు పొలాలకు వెళ్లే రైతులు,కూలీలు ఓ వైపు నుంచి ఎక్కి వెళ్తున్నారు. ప్రతిరోజు సర్కస్ ఫీట్ చేయాల్సి వస్తున్నది. పొలాలకు వెళ్లే వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యువకులు మోసుకెళ్తే గాని కాలువ దాటే పరిస్థితి లేకుండా పోయింది. అధికారులు వెంటనే స్పందించి కాలువపై అవసరమైన చోట వంతెనలు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.