రామచంద్రాపురం, జనవరి 4: రాష్ట్ర ప్రభుత్వం చెరువులు, కుంటల పరిరక్షణకు చర్యలు చేపడుతుంటే, కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నాయి. కబ్జాదారులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం చెరువులు, కుంటలను వదలడం లేదు. సమైక్య రాష్ట్రంలో చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయతో వేలాది చెరువులకు జీవం పోసింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో చెరువులు బాగుపడి భూగర్భజలాలు మెరుగుపడ్డాయి. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చెరువులన్నింటినీ మిషన్కాకతీయలో భాగంగా అభివృద్ధి చేశారు. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న తెల్లాపూర్ మున్సిపాలిటీలో భూముల ధరలు కోట్లకు పడగలెత్తాయి. దీంతో కబ్జాదారులు చెరువులకు సంబంధించి ఎఫ్టీఎల్, బఫర్జోన్లను కూడా విడిచిపెట్టడం లేదు.
ఎఫ్టీఎల్, బఫర్జోన్లను ఇలాగే ఆక్రమించుకుంటూ పోతే భవిష్యత్తు తరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. తెల్లాపూర్ పరిధిలోని వనం చెరువు, మేళ్ల చెరువు, చెలికుంట, కొల్లూర్లోని పెద్ద చెరువు ఇలా చెప్పుకుంటూ పోతే మున్సిపాలిటీ పరిధిలోని చెరువులు, కుంటలకు సంబంధించిన కాల్వలు ఇప్పటికే ఆక్రమణకు గురయ్యాయి. చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయని గతంలో పలువురు ఎన్జీటీని ఆశ్రయించారు. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడైనా కాల్వలు, చెరువులు కబ్జాలకు గురైతే నామమాత్రపు చర్యల్లో భాగంగా అధికారులు సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారే తప్ప కఠిన చర్యలు చేపట్టడం లేదని తెలుస్తున్నది.
తాజాగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ‘చెలికుంట’ ఎఫ్టీఎల్ ఆక్రమణకు యత్నించింది. చెలికుంట విస్తీర్ణం 12.21 ఎకరాలు, దాని ఎఫ్టీఎల్ పరిధి 42ఎకరాలు ఉంటుంది. సదరు సంస్థ గతంలోనే ఎఫ్టీఎల్లో ప్రహరీ కట్టి ఆక్రమించుకున్నప్పటికీ అధికారులు మౌన నిద్రలో ఉన్నారు. దీంతో అదును చూసుకొని లారీలతో ప్రహరీ లోపల మట్టిని నింపి ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా దాని పక్కనే ఉన్న మరో సంస్థ ఏకంగా ఎఫ్టీఎల్లోనే క్లబ్హౌస్ నిర్మాణం చేపడుతున్నది. మేళ్ల చెరువు సంబంధించిన బఫర్ జోన్లో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నది.
వనం చెరువుకి సంబంధించి గ్రామస్తుల ఫిర్యాదుతో స్పందించిన ఇరిగేషన్ అధికారులు, పనులను నిలిపివేసి నామమాత్రంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, ఎఫ్టీఎల్లో నింపిన మట్టిని సదరు వ్యక్తులతో తొలిగింపజేసే ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. ఇప్పటికే చెలికుంటకు సంబంధించి సంగం వరకు ఎఫ్టీఎల్ కబ్జాకు గురైందని, ప్రస్తుతం ఉన్నదాన్ని కాపాడడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెల్లాపూర్, ఉస్మాన్నగర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చెరువుల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. తెల్లాపూర్ పరిధిలో మేళ్ల చెరువు, వనం చెరువు, చెలికుంట ఉన్నాయి. చెరువుల అభివృద్ధికి మిషన్ భగీరథలో భాగంగా గతంలో కోట్లాది రూపాయలు కేటాయించారు. ప్రతి చెరువులో పూడికతీత, అలుగులు, తూంలు, చెరువు కట్టల పునరుద్ధరణ పనులు చేపట్టారు. అయితే చెరువులకు సం బంధించిన కాల్వలు కబ్జాలకు గురవుతుండడంతో చెరువుల్లోకి నీరు రాని పరిస్థితి ఉంది. కాల్వల కబ్జాలు, ఎఫ్టీఎల్ ఆక్రమణలపై కన్నెర్ర చేయాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో ప్రభుత్వ ఆశయం నీరుగారిపోతున్నది. రియల్ ఎస్టేట్ సంస్థలకు తలోగ్గుతూ అధికారులు కండ్లు ముసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ధనార్జనే ధ్యేయంగా రియల్ ఎస్టేట్ సంస్థలు కాల్వలు, ఎఫ్టీఎల్లను ఆక్రమించుకుంటు నిర్మాణాలు చేపడుతున్నాయి. దీంతో భవిష్యత్తు తరాలకు ముప్పు తప్పేలా లేదు. ప్రస్తుతం చెలికుంట విషయంలో కలెక్టర్ స్పందించి చెరువుని పరిరక్షించాలని పలువురు కోరుతున్నారు.
చెలికుంట ఎఫ్టీఎల్ ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపడతాం. చెలికుంట ఎఫ్టీఎల్లో మట్టిని నింపుతున్నట్లు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి పనులు నిలిపి వేసి సంబంధిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఎఫ్టీఎల్లో నింపిన మట్టిని తొలిగించే విషయం లో మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లాం. ఎఫ్టీఎల్లో నింపిన మట్టిని అంచ నా వేసి ఆ వ్యక్తికి జరిమానా విధిస్తాం. తెల్లాపూర్ మున్సిపాలిటీలో చెరువులు, కుంటలకు సంబంధించి ఎక్కడైనా ఆక్రమణలకు గురైతే ప్రజలు వెంటనే మా దృష్టికి తీసుకురావాలి.
– సంతోషి, ఇరిగేషన్ ఏఈ