జహీరాబాద్, ఆగస్టు 5: ఉమ్మడి రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల కోసం అన్నదాతలు క్యూలైన్లో ఉండి కొనుగోలు చేసేవారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం కర్ణాటక సరిహద్దులో ఉండడంతో రైతులు వానకాలం సీజన్లో విత్తనాలు,ఎరువులకు కర్ణాటకలోని బీదర్, హుమ్నాబాద్, చించొళికి వెళ్లి కొనుగోలు చేయాల్సి వచ్చేది. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, న్యాల్కల్, మొగుడంపల్లి మండలాల్లోని రైతులు అధికంగా విత్తనాలు, ఎరువులు కర్ణాటకలో కొనుగోలు చేసి, పండిన పంటలను సైతం బీదర్ మార్కెట్లో అమ్మేవారు. కొందరు రైతులు బీదర్లో ఉన్న వ్యాపారుల వద్ద ముందుగానే విత్తనాలు, ఎరువులు, పంట సాగు కోసం డబ్బులు వడ్డీలకు తీసుకునేవారు. వ్యాపారులు పంటలు కోతకు రాగానే బీదర్ నుంచి రైతుల ఇంటికి వాహనంతో వచ్చి పెసరులు, మినుములు,కందులు, జొన్నలు ఇతర పంటలు తూకం వేసి తీసుకునే వారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక జహీరాబాద్ ప్రాంత రైతుల పరిస్థితి మారిపోయింది. తెలంగాణ ప్రభుత్వం పంటల సాగుకు రైతుబంధు కింద ఎకరాకు రూ. 5 వేలు, రెండు పంటలకు రూ. 10 వేలు చెల్లిస్తున్నది. పంటలు సాగు చేసేందుకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వడంతో జహీరాబాద్ ప్రాంత రైతులు బీదర్ వ్యాపారుల వద్దకు పోవడం లేదు. పండించిన పంటలను మద్దతు ధర కోసం ప్రభుత్వం స్థానికంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముతున్నారు. స్వరాష్ట్రంలో జహీరాబాద్ రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది.
బీదర్కు వెళ్లేవారు…
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, రసాయన మందులు అందుబాటులో ఉంచకపోవడంతో జహీరాబాద్ ప్రాంత రైతులు వ్యయప్రయాసలకోర్చి బీదర్లో కొనుగోలు చేసేవారు. కర్ణాటకలోని బీదర్, హుమ్నాబాద్, చించొళిలో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి పంటలు వేసేవారు. అక్కడి వ్యాపారులు తెలంగాణ రైతుల అవసరాలు ఆసరా చేసుకోని అధిక ధరలకు అమ్మకాలు చేయడంతో పాటు నాణ్యత లేని విత్తనాలు అంటగట్టేవారు. గతంలో నకిలీ విత్తనాలు వేసిన రైతులు నష్టపోయి వ్యాపారుల వద్దకు వెళ్తే స్పందించే వారు కాదు. దీంతో పంటలకు నష్టం జరిగిన వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసే వారు కాదు. పంట దిగుబడులు లేక రైతులు నష్టాలకు గురైన సంఘటనలు అనేకం ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో మారిన రైతుల పరిస్థితి…
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వానకాలం సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, రసాయన మందులు ముందుగానే అందిస్తున్నారు. తొలకరి వర్షలు కురిసిన వెంటనే రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. రైతులు పంటలు సాగు చేసేందుకు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లే పరిస్థితి లేదు. సీజన్లో విత్తనాలు వేసేందుకు పంట పెట్టుబడి కింద రైతుబంధులో ప్రభుత్వం సాయం చేస్తున్నది. చిన్న, సన్నకారు రైతులు, పెద్ద రైతులు సకాలంలో విత్తనాలు వేసి ధీమాగా పంటలు పండిస్తున్నారు. దీంతో ఈ ప్రాంత రైతుల పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం జహీరాబాద్ డివిజన్లో 61,536 వేల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న 10 వేల ఎకరాలు, సోయాబీన్ 48,760 వేల ఎకరాలు, మినుము 3,002 వేల ఎకరాలు, పెసర్లు 3,728 వేల ఎకరాలు, కందులు 47,844 వేల ఎకరాల్లో సాగు చేస్తునట్లు అధికారులు తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు లేవు…
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో పాటు మద్దతు ధర కలిపించక పోవడంతో జహీరాబాద్ ప్రాంత రైతులు జహీరాబాద్లో ఆందోళనలు చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. వానకాలంలో రైతులు పండించిన పెసర్లు, మినుములకు మద్దతు ధర లేక జహీరాబాద్ రైతులు బీదర్ వ్యాపారుల వద్ద నిల్వ ఉంచే వారు. భారీ వర్షాలు కురిసిన సమయంలో వ్యాపారుల వద్ద నిల్వ చేసిన పెసర్లు, మినులు వర్షానికి తడిసిపోయి మొలకలు వచ్చిన సంఘటనలు ఉన్నాయి. పెసర్లు, మినులు వర్షానికి తడిసిపోవడంతో వ్యాపారులు కొనుగోలు చేసే వారు కాదు. వ్యాపారులు చెప్పిన ధరకు పంటలు ఇచ్చి రైతులు నష్టానికి గురైన సంఘటనలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొంటున్నారు. రైతులకు కొనుగోలు కేంద్రంలో మద్ద తు ధర రావడంతో రైతులు ఇక్కడే అమ్మకాలు చేస్తున్నారు. ఎలాంటి మోసాలు లేకుండా కొనుగోలు కేంద్రా ల వద్ద పంట ఉత్పత్తుల అమ్మకాలు సాగుతున్నాయి. పంటలు బీదర్లో అమ్మకాలు చేయడం నిలిపివేశారు. బీదర్లో పంట అమ్మకాలు చేసేందుకు వెళ్లిన రైతులు తూకం కాకపోతే రెండు రోజులు అక్కడ ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ పరిస్థితి లేదు.
ఈడనే ఎరువులు, విత్తనాల దొరుకుతున్నయ్..
గతంలో ఎరువులు, విత్తనాలు కోసం ఉదయం వచ్చి క్యూలైన్లో ఉండేటోళ్లం. కొన్ని సార్లు పోలీస్ స్టేషన్లో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో ఎరువులు, విత్తనాల కొరత లేదు. టైంకు విత్తనాలు వేసేందుకు ఖర్చు కోసం సర్కారు డబ్బులు బ్యాంకు ఖాతాలో జామ చేస్తున్నది. దీంతో ఎవరి వద్ద అప్పలు తీసుకోవడం లేదు. జహీరాబాద్లో విత్తనాలు, ఎరువులు లేకపోతే కర్ణాటకలో కొనుగోలు చేసేటోళ్లం. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ఆ పరిస్థితి లేదు. రైతులకు అవసరైన విత్తనాలు, ఎరువులు ఇక్కడనే ఇస్తూ పండించిన పంటలకు మద్దతు ధర ఇస్తున్నారు.
– రాజు, రైతు, సిద్దాపూర్తండా, జహీరాబాద్
తెలంగాణ అచ్చినంకనే మంచిగున్నది..
పంటలు పడించేటందుకు ఇప్పుడు అప్పటి లెక్క కష్టాలు లేవు. సర్కారే ఎకరానికి రూ.5 వేలు రైతుబంధు పైసలు ఇస్తున్నది. సర్కార్ ఇచ్చిన పైసలతో ఇత్తనాలు, ఎరువులు కొంటున్నం. వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు తీసుకుంటలేము. జహీరాబాద్లనే ఇత్తనాలు, ఎరువులు మార్కెట్ల దొరుకుతున్నయి. గతంలో ఈటికోసం చానా గోసవడ్డాం. తెలంగాణ అచ్చినంకనే అన్నివిధాలుగా సౌలత్ మంచిగున్నది.
– లక్ష్మీబాయి, రైతు, సిద్దాపూర్ తండా, జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా