పట్నం వారం సందర్భంగా కొమురవెల్లి మల్లన్న క్షేత్రం పసుపువర్ణ శోభితమైంది. భక్తులు చల్లుకున్న పసుపుతో స్వామివారి సన్నిధి పసుపుమయమైంది. పంచవర్ణాల పెద్ద పట్నాన్ని దాటుకుంటూ అగ్నిగుండ ప్రవేశం చేస్తూ మేడలమ్మ, కేతమ్మ సమేత మల్లికార్జునుడిని దర్శించుకొని భక్తులు తన్మయత్వం పొందారు. కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవస్థానం వద్ద పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
చేర్యాల, జనవరి 22 : పట్నం వారం సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న క్షేత్రం పసుపుమయంగా మారింది. హైదరాబాద్ యాదవ సంఘం ఆధ్వర్యంలో కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయవర్గాల సహకారంతో సోమవారం పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమం వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు అగ్నిగుండాలను దాటే కార్యక్రమం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. పెద్దపట్నం చూసిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. పట్నం వారానికి వచ్చిన భక్తులు శనివారం ధూళిదర్శనం, ఆదివారం బోనాలు, పట్నాలు, సోమవారం పెద్ద పట్నం, అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. మల్లన్న ఆలయ ఒగ్గు పూజారులు పట్నం వేసి కార్యక్రమాన్ని ప్రారంభించడంతో హైదరాబాద్ ఒగ్గు పూజారులు పంచవర్ణాలు (తెలుపు, పసుపు, నీలి, ఎరుపు, ఆకుపచ్చ) రంగుల పిండితో పెద్దపట్నం వేశారు.
పంచ పల్లవాలు (మామిడి, జువ్వి, రాగి, మేడి, మర్రి) కట్టెలను వరుసగా పేర్చి అగ్నిగుండంగా తయారు చేశారు. అర్చకులు స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పెద్దపట్నం, అగ్నిగుండం వరకు తీసుకొచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దపట్నం, అగ్నిగుండాలను ఆలయ అర్చకులు దాటిన వెంటనే భక్తులు దాటారు. ఆలయంలో మల్లికార్జునస్వామి, బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలను దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం మేరకు శివసత్తులు, ఘనాచార్యులకు ఆలయ ఈవో బాలాజీ, ఆలయ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, కమిటీ సభ్యులు కండువా, జాకెట్ ముక్కలతోపాటు స్వామి వారి బండారిని పంపిణీ చేశారు. అంతకు ముందు భక్తులు పసుపును ఒల్లంతా పూసుకోవడంతో పాటు ఒకరిపై ఒకరు చల్లుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించడంతో పాల్గొనేందుకు భక్తులు గంటల పాటు వేచి ఉన్నారు.