సిద్దిపేట, ఫిబ్రవరి 9 : సిద్దిపేటకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక, సాహితీవేత్త, అష్టావధాని అష్టకాల నరసింహరామశర్మ(90) గురువారం సిద్దిపేటలో గుండెపోటుతో పరమపదించారు. నంగునూరు మండలం రాజగోపాల్పేట గ్రామానికి చెందిన ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ సిద్దిపేటలో స్థిరపడ్డారు. సరస్వతీ పుత్రుడిగా పేరుగడించిన అష్టకాల నరసింహరామశర్మ తన 15 ఏట బాసర సరస్వతి క్షేత్రాన్ని దర్శించి, అక్కడ 46రోజుల పాటు ధ్యానం చేసి అమ్మవారి కటాక్షం పొందారు. అమ్మవారి ఆజ్ఞ మేరకు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామంలో ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాల సరిహద్దుల్లో 1980లో సరస్వతి దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అమ్మవారి ఆజ్ఞ మేరకు అవధాన ప్రక్రియలో వచ్చిన డబ్బులతో దేవాలయాన్ని నిర్మించారు.1990,జనవరి 31న మాఘశుద్ధ పంచమి రోజు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1990లో అప్పటి సిద్దిపేట ఎమ్మెల్యే, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మూడు దశాబ్దాల్లో ఆ దేవాలయం గొప్ప క్షేత్రంగా అభివృద్ధి చెందింది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో భాగంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆయన 500 సరస్వతీ యజ్ఞాలు నిర్వహించారు. జ్యోతిష్యం, వాస్తు శాస్ర్తాల్లో ప్రావీణ్యం సాధించి సేవలందించారు. 40 ఏండ్లుగా పచ్చిపాలు, పండ్లు మాత్రమే తీసుకుంటూ నిరాహారయోగిగా నిరాడంబర ఆధ్యాత్మిక జీవనం గడిపారు. బుధవారం రాత్రి గుండెపోటుతో సిద్దిపేటలోని తన స్వగృహంలో మృతిచెందారు. ఆయనకు భార్య రత్నాబాయి, నలుగురు కుమారులు విద్యామనోహర్ శర్మ, విద్యాసాగర్శర్మ, విద్యాచరణ్ శర్మ, విద్యాలక్ష్మీనాథ్శర్మ, కుమార్తె విద్య ఉన్నారు. అష్టకాల నరసింహరామశర్మ పార్థివదేహాన్ని అనంతసాగర్ సరస్వతీ దేవాలయం వద్ద ఉన్న ఆయన ఇంటికి తరలించారు. వారి అంత్యక్రియలు శుక్రవారం ఉదయం 10 గంటలకు అనంతసాగర్లో జరుగుతాయని బంధువులు తెలిపారు.
సాహిత్యవేత్త, అవధాన పండితులు…
చిన్ననాటి నుంచే సాహిత్యంపై ప్రావీణ్యం సాధించిన అష్టకాల నరసింహరామశర్మ పలు పద్య కావ్యాలు, ఖండ కావ్యాలు రచించారు. శ్రీరామచంద్రిక, పురుషోత్తముడు వంటి కావ్యాలు, శిథిల విపంచి, ఆత్మవేదం, ఖండకావ్యాలు, వాసరేశ్వరి, శ్రీరామప్రభు శతక పద్యాల పుస్తకాలు, ‘నాకు తెలిసిన నేను’ అనే ఆత్మకథ వంటి పుస్తకాలే కాకుండా ఇంకా అనేక రచనలు చేసి సాహిత్య రంగంలో పలు పురస్కారాలు పొందారు. అవధాన ప్రక్రియలో ప్రావీణ్యం సాధించి 200లకు పైగా అష్టావధానాలు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో అనేక చోట్ల ఆయన అష్టావధానాలు జరిగాయి. అష్టావధానాలు చేయడంతో పాటు జ్యోతిష్య శాస్త్ర పండిడిగా,కవిగా పేరుపొందారు.తెలుగుతో పాటు సంస్కృతంలో నరసింహా రామశర్మ చేసిన అనేక రచనలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. సాహిత్య రంగంలో చేసిన సేవలకు 2014లో తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారంతో సన్మానించింది. 2003లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందించింది. 2010లో కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి స్వర్ణకంకణంతో సత్కరించారు. కనకాభిషేకం,తులాభార సత్కారాలు పొందారు.వీణాపాణి త్రైమాసిక పత్రికను నడిపారు. అవధాన శిరోమణి,అవధాన జ్ఞాన భారతి, సారస్వత శిరోమణి, కవితా సుధాకర, కవికోవిద, బ్రాహ్మీవిభూషణ, అవధాన కళాప్రపూర్ణ బిరుదులు పొందారు.
ప్రముఖుల సంతాపం…
అష్టకాల నరసింహరామశర్మ ఆధ్యాత్మిక, సాహితీ రంగాలకు చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, ప్రముఖ కవి నందినీ సిధారెడ్డి అన్నారు. ఆయన పార్థివ దేహంపై పుష్పగుచ్ఛం వేసి నివాళులు అర్పించారు. జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణ శర్మ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అష్టకాల నరసింహరామశర్మ మృతితో రాష్ట్రం గొప్ప ఆధ్యాత్మిక, సాహిత్యవేత్తను కోల్పోయిందన్నారు. వందలాది అష్టవధానాలు చేసిన గొప్ప పండితుడు ఆయన అన్నారు.వివిధ శక్తిపీఠాల్లో 500పైగా యజాలు జరిపించి ప్రజల్లో భక్తిభావాన్ని చాటారని, సరస్వతి అమ్మవారి ప్రాశస్యాన్ని ప్రచారం చేసిన గొప్ప ఆధ్యాత్మిక వేత్త అన్నారు. ఆయన మరణం తమకు వ్యక్తిగతంగా తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రముఖ చిత్రకారుడు రుస్తుం తన సంతాపం తెలిపారు.
అష్టకాల నరసింహరామశర్మ జీవితం భావితరాలకు మార్గదర్శనం
ప్రముఖ పండితులు అష్టకాల నృసింహ రామశర్మ మృతి అవధానానికి, ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు నివాళుర్పించారు. ఆయన మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, తన సంతాపం తెలిపారు. ఆయన మరణం ఎంతో బాధాకరం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు, తనకు అత్యంత ఆత్మీయులు అని, ఆయనతో అనుబంధాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. వేదాలు అవసోసి వేలాదిమంది శిష్యులను తయారుచేశారన్నారు. దేశంలో వందలాది అష్టావధానాలను చేసిన అవధానిగా సిద్దిపేటకు, తెలంగాణకు వన్నె తెచ్చిన గురువు ఆయన అని కొనియాడారు. అవధాన ప్రక్రియతో వచ్చిన డబ్బులతో అనంత సాగర్లో సరస్వతి అమ్మవారి దేవాలయాన్ని నిర్మించి, సామాజిక సేవకుడిగా సమాజంలో స్ఫూర్తిని నింపారన్నారు. ఎంతోమందిని అవధానులుగా తీర్చిదిద్ది అవధాన శిరోమణిగా పేరుగాంచారన్నారు. హైదరాబాద్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో అష్టకాల నరసింహరామశర్మ అవధానాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయించామని గుర్తుచేశారు.దేశంలో వివిధ ప్రాంతాల్లో 500లకు పైగా సరస్వతి యజ్ఞ యాగాలు నిర్వహించి, అమ్మవారి మహాత్యాన్ని చాటి చెప్పారన్నారు.ఎన్నో ఆలయాలను తన చేతుల మీదుగా ప్రతిష్ఠించి, అనేక ధర్మ సందేహాలను నివృత్తి చేసిన గొప్ప పండితులు అని కొనియాడారు. ఆయన జీవితం భావితరాలకు మార్గదర్శనం అన్నారు. వారి మరణం ఆధ్యాత్మిక, ధార్మిక రంగాలకు, అవధానానికి తీరని లోటు అన్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు మంత్రి హరీశ్రావు తన ప్రగాడ సానుభూతిని తెలిపారు.
-సంతాపం తెలిపిన మంత్రి హరీశ్రావు