ఆషాఢమాసం బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం పల్లెలు, పట్టణాల్లో మహిళలు బోనాలతో వెళ్లి గ్రామదేవతలకు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. శివసత్తుల సిగాలు, పోతరాజుల విన్యాసాలతో అంతటా సందడి వాతావరణం నెలకొన్నది. ఆయురారోగ్యాలు ప్రసాదించి, పంటలు బాగా పండేలా చూడాలని అమ్మవార్లను వేడుకున్నారు.
– సంగారెడ్డి/మెదక్, న్యూస్నెట్వర్క్, జూలై 11
పెద్దశంకరంపేట/ టేక్మాల్/ రామాయంపేట/ వెల్దుర్తి/ మెదక్ రూరల్, జూలై11: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని జిల్లాలోని రేణుకా ఎల్లమ్మ, పోచమ్మ,పలు ఆలయాల్లో భక్తులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలను గ్రామాల్లోని ప్రధాన వీధుల గుండా ఊరేగించి అమ్మవారికి సమర్పించారు. పెద్దశంకరంపేట పట్టణంలోని భవానీమాత, రేణుకా ఎల్లమ్మ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టేక్మాల్ మండలం కుసంగి గ్రామంలో ముదిరాజ్ సంఘం సభ్యులు, గ్రామస్తులు బోనాలను ఊరేగించారు.
బోనాలను ప్రధాన వీధుల గుండా ఊరేగించి రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రామయంపేట పట్టణంలోని ఏడీదుల ఎల్లమ్మ బోనాలను పలు కాలనీ వాసులు బోనాలను ఊరేగించి అమ్మవారికి సమర్పించారు. ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని వెల్దుర్తిలో గౌడసంఘం సభ్యులు బోనాలను ఊరేగించారు. బోనాలను రేణుకా ఎల్లమ్మ ఆలయంలో సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మెదక్ మండలంలోని మంబోజిపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ ఆలయంలో గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.