సంగారెడ్డి, జూన్ 2 : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం 20రోజుల పాటు వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం విజయవంతంగా తొమ్మిది ఏండ్లు పూర్తి చేసుకుని పదో ఏడాదిలో అడుగు పెట్టిన సందర్భంగా తెలంగాణ ఆత్మ గౌరవ ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది. నేడు రైతు దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఒక్కో రైతువేదిక పరిధిలోని గ్రామాల నుంచి అన్నదాతలను వెయ్యి నుంచి 15వందల మందిని తరలించి పండుగలా ఉత్సవా లు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆయా రైతు వేదికల పర్యవేక్షణకు ఒక ఇన్చార్జీల చొప్పున పార్టీ ప్రజా ప్రతినిధులను నియమించారు. ఇన్చార్జిలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుని అందరికీ భోజనాలు అందే వరకు పర్యవేక్షిస్తారు. సదాశివపేట మండలం మద్దికుంట రైతువేదికకు రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతాప్రభాకర్ ఇన్చార్జిగా నియామకం అయ్యారు. రైతు దినోత్సవానికి తరలివచ్చే అన్నదాతలకు భోజన వసతితో పాటు మంచినీరు అందించే ఏర్పాట్లను వ్యవసాయ అధికారులు ఏర్పాటు చేశారు.
న్యాల్కల్, జూన్ 2: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించే రైతు దినోత్సవంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మండల ప్రత్యేకాధికారి, డీఎల్పీవో రాఘవరావు అన్నారు. శనివారం మండలంలోని చాల్కి, హుస్సేనగర్ గ్రామాల్లోని రైతు వేదికల్లో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. రైతు దినోత్సవ వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు కలుకుండా ఏర్పాట్లన్నీ సిద్ధం చేయాలన్నారు.
రాయికోడ్, జూన్ 2 : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు మండలంలోని రైతు వేదికల్లో శనివారం రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మండల ప్రత్యేక అధికారి, జిల్లా బీసీ అధివృద్ధికారి జగదీశ్ అన్నారు. శుక్రవారం రాయికోడ్, సింగితం, ఔరంగనగర్ గ్రామాల్లోని రైతు వేదికలో ఏర్పాట్లును పరిశీలించారు.