జహీరాబాద్, డిసెంబర్ 14 : మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టరు ప్లాంట్లో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ట్రాక్టరు ప్లాంట్లో ఈ నెల 16న కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల కోసం ఏర్పాట్లు చేయగా, గుర్తింపు సంఘం ఎన్నికల్లో భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ), మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్ యాక్టివ్ వర్కర్స్ యూనియన్ పోటీ చేస్తున్నది. సీఐటీయూ, బీఎంఎస్ కార్మిక సంఘం పోటీ చేస్తున్నది. జహీరాబాద్ ట్రాక్టర్ ప్లాంట్లో మొదటిసారి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు 2021 సెప్టెంబర్ 21న నిర్వహించారు. అప్పుడు టీఆర్ఎస్కే కార్మిక సంఘం ఎన్నికల్లో గెలుపొందింది. టీఆర్ఎస్కే అధ్యక్షుడిగా రాంబాబు యాదవ్ పోటీ చేసి సీఐటీయూపై గెలుపొందారు. రెండోసారి జరుగుతున్న కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జోరుగా ప్రచారం చేస్తున్నది.
శుక్రవారం గేట్ మీటింగ్ ఏర్పాటుకు కార్మికులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రెండోసారి రాంబాబు యాదవ్ విజయం కోసం కార్మికులు జోరుగా ప్లాంట్లో ప్రచారం చేస్తున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టరు ప్లాంట్లో 410 మంది కార్మికులకు ఓటు హక్కు ఉంది. వీరు ఈ నెల 16న జరిగే కార్మిక సంఘం ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్కేకు 239 ఓట్లు రాగా, సీఐటీయూకు 157 ఓట్లు, బీఎంఎస్కు 13 ఓట్లు వచ్చాయి. కార్మిక సంఘం ఎన్నికలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు నిర్వహిస్తారు.