నర్సాపూర్, మార్చి 7 : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలకు పురస్కారాలను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 27 మందిని ఎంపిక చేస్తూ స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి భారతి హోళికేరీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పురస్కారానికి మెదక్ జిల్లా కౌడిపల్లి మండలానికి చెందిన అంగన్వాడీ ఆయా రజియా సుల్తానా ఎంపికైంది. అంగన్వాడీ కేంద్రంలో ఆమె చేసిన విశిష్ట సేవలను గుర్తించిన ప్రభుత్వం ఈ పురస్కారానికి ఎంపిక చేసింది.
తల్లిని ఆదర్శంగా తీసుకుని..
కౌడిపల్లి మండల పరిధిలోని వెల్మకన్న గ్రామంలో సాహెబి ఖాజామియా దంపతులకు రజియా సుల్తానా జన్మించింది.తన తల్లి స్థానికంగా అంగన్వాడీలో ఆయాగా విధుల నిర్వర్తించేంది. ఈ క్రమంలో రజియా చిన్నప్పటి నుంచే తల్లి వెంట కేంద్రానికి వెళ్తాం. చిన్నారులకు అందించే ఆలనాపాలనా పరిశీలించేది. అప్పటి నుంచే తనలో సమాజ సేవా చేయాలనే దృక్ఫథం ఏర్పడింది. కౌడిపల్లి మండల కేంద్రంలో ఓపెన్ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన రజియా సుల్తానాకు కౌడిపల్లికి చెందిన ఆసిఫ్తో 2004 సంవత్సరంలో వివాహం జరిగింది.
2007వ సంవత్సరంలో అంగన్వాడీ హెల్పర్గా విధుల్లో చేరింది. విధుల్లో చేరిన నాటి నుంచి ప్రభుత్వం అందించిన పోషక ఆహారాలను పిల్లలు,గర్భిణులు, బాలింతలకు అందజేస్తూ వారి ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్త వహిస్తుంది. న్యూట్రీషన్ గార్డెన్లో వివిధ కూరగాయలు మొక్కలు పెంచుతూ నిర్వహణను చూసుకుంటున్నది. పిల్లలకు ఆకుకూరలు, కూరగాయలు అందించేలా కృషి చేస్తుంది. గర్భిణులు, బాలింతలకు సమావేశం ఏర్పాటు చేసినప్పుడు వారికి ఆరోగ్యంపై అవగాహన కల్పించడంలో ముందుంటున్నది. అంగన్వాడీ కేంద్రాన్ని ఎప్పుడూ శుభ్రపరచడంతో పాటు ఆవరణలో మొక్కలు నాటి వాటి సంరక్షణను చూసుకుంటున్నది. భర్త ప్రోత్సాహంతో విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటుంది.
చాలా సంతోషంగా ఉంది : రజియా సుల్తానా
తెలంగాణ ప్రభుత్వం నుంచి పురస్కారం దక్కుతుందని కలలో కూడా అనుకోలేదు. నేను అందించిన సేవలను గుర్తించి ఈ పురస్కారం ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. నా సేవ వృథా కాలేదు. ప్రభుత్వం నన్ను ఇంకా ప్రోత్సహించేలా చేసింది. ఈ పురస్కారం నాపై మరింత బాధ్యతను పెంచింది. ఇదే స్ఫూర్తితో నా సేవలను కొనసాగిస్తాను. ఈ పురస్కారం అందుకోవడం వెనుక పైఅధికారుల ప్రోత్సాహం ఎంతో ఉంది. ఈ సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.