సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. సరిగ్గా అదే కోవలోకి వస్తుంది సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూర్ గ్రామానికి చెందిన ఓ కళాకారుల కుటుంబం. ఎప్పుడో 200 ఏండ్ల క్రితం సురభి డ్రామా కంపెనీలో వారి పూర్వీకులు పనిచేశారు. ఆ వారసత్వమే తండ్రీకొడుకులకు బుల్లితెర, వెండితెర రంగంలోకి దారులు చూపాయి. మద్రాసు పెత్తనం, ఆంధ్ర ప్రాంత ఆధిపత్యంలో నడుస్తున్న టీవీ, సినిమా రంగాల్లో తెలంగాణ యాసను, భాషను సాంస్కృతిక వైభవాన్ని ఎలుగెత్తి చాటుతున్న వర్ధమాన నటులు వీళ్లు. టీవీ, సినిమా రంగాల్లో బీజీ బీజీగా మారుతున్న లక్ష్మీకిరణ్, జయతీర్థ
అనే తండ్రీ కొడుకుల గురించి ప్రత్యేక కథనం…
వర్గల్, మే 13: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూర్ గ్రామానికి చెందిన మొలుగు వెంకటనర్సింహారావు దేశ్ముఖ్పాండే వారసులు రెండు శతబ్దాల క్రితమే సురభి నాటక కంపెనీలో విభిన్న పాత్రలతో అలరించారు. 18వ శతాబ్దంలోనే తెలుగు భాషా సంస్కృతిని, ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేస్తూ ఎందరో కళాకారులను తీర్చిదిద్దిన ఘనాపాటి మాడపాటి హనుమంతారావు లాంటి గొప్ప భాషావాది ఏలుబడిలో పనిచేసిన అనుభవం మొలుగువారి కుటుంబానికి ఉంది. ఆ కుటుంబానికి చెందిన టీవీ సీరియల్ (జబర్దస్త్ ఫేం)మొలుగు లక్ష్మీకిరణ్ అలియాస్ లచ్చన్న కళారంగంపై ఉన్న యావతో 20 ఏళ్ల ఏండ్ల క్రితమే హైదరాబాద్ బాట పట్టారు. తొలిరోజుల్లో వేషాల కోసం తిరగని ఆఫీస్లుల్లేవు. కలవని డైరెక్టర్లు లేరు. నటనపై ఉన్న జిజ్ఞాసను చంపుకోలేకున్న లక్ష్మీకిరణ్ను ఒక దశలో అవకాశాలు వచ్చీరానట్లే చేశాయి. అయినా నైరాశ్యం చెందకుండా మొక్కవోని దీక్షతో ఉన్న లక్ష్మీకిరణ్ అద్దె గది కిరాయి కట్టలేని పరిస్థితులు చాలా కాలం వెంటాయి. ఇలాంటి సందర్భంలోనే లక్ష్మీకిరణ్కు ప్రముఖ సంస్థ మల్లెమాల రూపొందించిన జబర్దస్త్ కామెడీ షో అమాంతం ఆకాశానికి ఎత్తింది. వందలాది టీవీ సీరియళ్లు, చిన్న సినిమాల్లో అవకాశాలు పొందుతూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్, సిద్దిపేటల్లో జరిగిన 2023 ఉత్తమ సాహితీ కేటగిరీలో ఉగాది ప్రతిభా పురస్కారాలను మంత్రులు హరీశ్రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచి అందుకున్నారు.
లక్ష్మీకిరణ్కు జయతీర్థ, పూర్ణబోధ అనే ఇద్దరు కొడుకులున్నారు. షేక్పేట ఇంటర్నేషనల్ స్కూల్లో 9వ తరగతి ఒకరు, ఎనిమిదో క్లాసు మరొకరు చదువుతున్నారు. చదువు కొనసాగిస్తూనే ఆ ఇద్దరు కొడుకులు తండ్రి బాటలో పయనిస్తున్నారు. బుల్లితెర, నాటక కళా పరిషత్లతో పాటు పలు వేదికలపై ఏకపాత్రాభినయం చేయడం పరిపాటిగా మారింది. టీవీ సీరియళ్ల్లు, సినిమాల్లో నటనా అవకాశాలు పొందుతున్నారు. పౌరాణిక, సాంఘిక, సందేశాత్మక పాత్రల్లో నటిస్తూ విశ్లేషకులు, విమర్శకులతో శభాష్ అనిపించుకుంటున్నారు. జయతీర్థ గత సంవత్సరం నటించిన ‘మిషన్ ఇంపాసిబుల్’ అనే బాలల చిత్రం రికార్డులు సాధించింది. పలుమార్లు ప్రముఖ హీరోలు చిరంజీవి, మహేశ్బాబు, బాలకృష్ణ, వెంకటేశ్, ప్రభాస్, అల్లుఅర్జున్ల ప్రశంసలు పొందారు. పూర్ణబోధ సైతం ఎనిమిదో ఏటే నటించడం మొదలుపెట్టాడు. చిన్నతనం నుంచే నాటకాలు, భక్తి, పద్య పఠనం కంఠస్తం చేయడం అలవర్చుకున్నాడు. 2017లో చైల్డ్ ఆర్టిస్టుగా పలు ప్రదర్శనలు ఇచ్చి కళాప్రియులను మెప్పించాడు. గౌతమిపుత్ర శాతకర్ణ, ఆనందోబ్రహ్మ, వేదం వంటి సినిమాల్లోనూ మెరిశాడీ చిన్నోడు. ప్రపంచ తెలుగు మహాసభల్లో ఉత్తమ బాల నటుడిగా, సంగీత నాటక అకాడమి తరఫున ఉత్తమ బాలల పురస్కారం అందుకున్న పూర్ణబోధకు కొమురం భీం ఏకపాత్రాభినయం మంచి గుర్తింపు తెచ్చింది.