చిన్నశంకరంపేట, ఫిబ్రవరి 27 : తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన పిల్లలకు మైనంపల్లి ట్రస్ట్ ద్వారా ఒక్కొక్కరికి 25వేల రూపాయల చొప్పున ఫిక్స్ డిపాజిట్ చేసి వారిని ఆదుకుంటామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రకటించారు. సోమవారం తన కుమారుడు డాక్టర్ రోహిత్తో కలసి ఆయన చిన్నశంకరంపేటకు వచ్చారు. స్థానిక బస్టాండ్ నుంచి పట్టణంలో ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీగా శ్రీసోమేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లారు. ఆలయంలో స్వామివారికి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనాథ బాలికకు 25వేల రూపాయల ఫిక్స్ డిపాజిట్ పత్రాన్ని అందించి మైనంపల్లి ట్రస్టు సేవలను డాక్టర్ రోహిత్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, డాక్టర్ రోహిత్ను గజమాలతో సత్కరించారు. డాక్టర్ రోహిత్కు గొల్లకురుమలు గొంగడి కప్పి మేక పిల్లను బహూకరించారు.
డాక్టర్ రోహిత్ ఆధ్వర్యంలో మైనంపల్లి ట్రస్ట్
ఈ సందర్భంగా సర్పంచ్ రాజిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ.. ఇక నుంచి మెదక్ నియోజకవర్గంలో తన కుమారుడు డాక్టర్ రోహిత్ మైనంపల్లి ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. మెదక్ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో అనాథ పిల్లల కోసం రూ.1.25 కోట్ల చొప్పున, మెదక్ నియోజకవర్గంలో 10కోట్ల రూపాయలను ఖర్చు చేస్తానన్నారు. ఇక ముందు మైనంపల్లి ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది మెదక్ జిల్లా ప్రజలేనని గుర్తుచేశారు. ఇక నుంచి తన కుమారుడు డాక్టర్ రోహిత్ మెదక్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. నా సంపదలో 50శాతం సేవా కార్యక్రమాలకే వెచ్చిస్తానన్నారు. నాకంటే ఎక్కువగా ఎవరైనా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తే వారిని ఆదరిస్తామన్నారు.
మూడు నాలుగు రోజుల్లో ప్రతి ఇంటికీ వెళ్లి అనాథ పిల్లలకు 25వేల రూపాయల డిపాజిట్ పత్రాలను తన కుమారుడు డాక్టర్ రోహిత్ అందిస్తారని మైనంపల్లి హన్మంత్రావు తెలిపారు. ఈ సహాయం ప్రతి మండలంలో 500 మందికి అందేలా చూస్తారన్నారు. మెదక్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఒక పాఠశాలను దత్తత తీసుకొని అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. తన కుమారుడు తనకంటే ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేపడతారని తెలిపారు. కొవిడ్ సమయంలో కొవిడ్ బాధితులకు రూ.10కోట్ల విలువైన సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో కూడా తాను సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని మైనంపల్లి తెలిపారు. తాను మాటలు చెప్పడం కాదని, చేసి చూపిస్తానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు రాజిరెడ్డి, పోచయ్య, గోపాల్నాయక్, నరసమ్మ, నాయకులు సురేందర్గౌడ్, ప్రశాంత్రెడ్డి, మాజీ సర్పంచ్ మైనంపల్లి రంగారావు, ఏకే యాదవరావు, రమేశ్గౌడ్, ఉపసర్పంచ్ జీవన్, మేడి గణేశ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు.