మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 6: అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేడుకలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను భాగస్వాములు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతో అంబేద్కర్ విగ్రహావిష్కరణ, గొర్రెల పంపిణీ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఈనెల 14న హైదరాబాద్లో నిర్వహించనున్న విగ్రహావిష్కరణను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నదన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి జిల్లాలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరు బస్సుల్లో సుమారు 300 మంది చొప్పున హైదరాబాద్కు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్నం 1.30 గంటల లోపే విగ్రహావిష్కరణ సభా వేదిక వద్దకు ప్రజలు చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి బస్సులో ఒక పోలీస్ కానిస్టేబుల్తో పాటు ఏదైనా శాఖకు చెందిన మరో అధికారి వెంట ఉండేలా ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. నిర్ణీత సమయంలో ప్రజలు కార్యక్రమానికి చేరుకుని, ముగిసిన తరువాత తిరిగి తమ వాహనాల్లో వెళ్లేలా చూడాలన్నారు.
గొర్రెల పంపిణీకి సన్నద్ధం కావాలి
రెండో విడత గొర్రెల పంపిణీకి ప్రభుత్వం త్వరలోనే శ్రీకారం చుట్టనున్నదని, ఈ పథకం అమలు కోసం క్షేత్రస్థాయిలో అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని సీఎస్ కలెక్టర్లకు సూచించారు. లబ్ధిదారుల ఎంపిక, అవగాహన కల్పించడం, ఇతర రాష్ర్టాల నుంచి గొర్రెల కొనుగోలు, వాటి రవాణా, నిర్ధేశించిన ధ్రువీకరణ పత్రాల పంపిణీ అంశాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఈ కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, మైనింగ్ అధికారి జయరాజ్, ఆర్డీవోలు, ఆర్టీసీ డీఎం పాల్గొన్నారు.
ఈ ల్యాబ్ పోర్టల్లో వివరాలు నమోదు చేయాలి: కలెక్టర్ రాజర్షి షా
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల నుంచి 300 మంది చొప్పున, దుబ్బాక, అందోల్, నారాయణఖేడ్, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి వంద మంది చొప్పున తరలించేందుకు ప్రజాప్రతినిధులు సహకారంతో జాబితా రూపొందించాలన్నారు. మండల కేంద్రాల నుంచి బస్సులు బయలుదేరి, తిరిగి గమ్యస్థానాలకు చేరుకునేలా ప్రత్యేకాధికారులు చొరవ చూపాలని కలెక్టర్ సూచించారు. గొర్రెల పంపిణీపై సమీక్షిస్తూ మండల ప్రత్యేకాధికారులు పశు సంవర్దక అధికారులు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లతో లబ్ధిదారులకు అవగాహన కలిగించేలా సోమవారం నుంచి మండల స్థాయిలో కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు ఎంపీ, ఎమ్మెల్యేలను సంప్రదించి షెడ్యూల్ రూపొందిచాలని జిల్లా పశుసంవర్దక శాఖ అధికారి విజయశేఖర్రెడ్డిని ఆదేశించారు. ఇంతవరకు డీడీలు కట్టిన 850 మంది లబ్ధిదారులతో పాటు డీడీలు కట్టని 5,300 మందికి అవగాహన కల్పించాలన్నారు. వారి నుంచి ఆధార్, బ్యాంకు ఖాతా, కుల ధ్రువీకరణ పత్రాలు, నామిని వివరాలు సేకరించి ఈ ల్యాబ్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు.