కొమురవెల్లి మల్లన్న క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఆదివారం (నేడు) కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఆలయ యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. కల్యాణోత్సవం అనంతరం తొమ్మిది ఆదివారాల పాటు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. మల్లన్న కల్యాణోత్సవానికి ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రి హరీశ్రావు పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. కిలోన్నర బంగారంతో తయారుచేసిన బంగారు కిరీటం, కోరమీసం సిద్ధమయ్యాయి. స్వామి కల్యాణం అనంతరం మంత్రులు మల్లన్న స్వామికి సమర్పించనున్నారు. కల్యాణోత్సవానికి 50వేల మంది వరకు భక్తులు రానున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేశారు. 50వేల లడ్డూ ప్రసాదాలతో పాటు 5 క్వింటాళ్ల పులిహోర ప్యాకెట్లు సిద్ధం చేశారు. వేడుకల్లో రెగ్యులర్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, మొత్తం 70మందితో పాటు 100 మంది వలంటీర్లు విధులు నిర్వహించనున్నారు.
– చేర్యాల, డిసెంబర్ 17
కొమురవెల్లి మల్లన్న స్వామి కల్యాణోత్సవానికి వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. భక్తులకు వసతులు కల్పించేందుకు ఇందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కల్యాణ వేదిక తోటబావి ప్రాంతంలో నిర్మించిన శాశ్వత కల్యాణ వేదిక వద్ద బారికేడ్లు, షామియానాలు, పచ్చదనం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. నూతనంగా రాజగోపురం వద్ద క్యూలైన్లు, ప్రసాదాల విక్రయ కౌంటర్ల వద్ద తాగునీటి వసతి కల్పించారు. 24గంటల పాటు కరెంటు సరఫరాకు అంతా సిద్ధం చేశారు. 50వేల లడ్డూ ప్రసాదాలతో పాటు 5క్వింటాళ్ల పులిహోర ప్యాకెట్లు సిద్ధం చేశారు. 15వేల వాటర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. రెగ్యులర్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది మొత్తం 70 మందితో పాటు 100 మంది వలంటీర్లు విధులు నిర్వహించనున్నారు. ప్రభుత్వశాఖల అధికారులు సైతం ఆయా శాఖల వారీగా పనులను పర్యవేక్షిస్తున్నారు. సిద్దిపేట, జనగామ జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేకంగా బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్షేత్రంలో ఉన్న ఆర్టీసీ బస్స్టాండ్ ఉపయోగించుకోనున్నారు.
చేర్యాల, సిద్దిపేట, డిసెంబర్ 17: భక్తుల కొంగుబంగారం కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లన్న క్షేత్రంలో జరిగే కల్యాణోత్సవానికి రాష్ట్ర నలుమూలలతో పాటు పొరుగు రాష్ర్టాల నుంచి భక్తులు హాజరుకానున్నారు. ఆలయవర్గాలు స్వామి వారి కల్యాణ ఆహ్వాన పత్రికలను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, దాతలు, అధికారులకు, భక్తులకు అందజేశారు. స్వామి వారి క్షేత్రంలో నిర్వహించే ఈ మహోత్సవాన్ని వైభవంగా జరిపేందుకు ఆలయవర్గాలు విస్తృత ఏర్పాట్లు చేశాయి.మల్లన్న కల్యాణానికి రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో కలిసి పట్టవస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు హాజరుకానున్నట్లు ఆలయవర్గాలు వెల్లడించాయి. ఆలయ నిధులు రూ.96 లక్షలతో కిలోన్నర బంగారంతో తయారుచేసిన బంగారు కిరీటం, కోరమీసం తయారీ పనులు పూర్తయ్యాయి. కల్యాణం అనంతరం మంత్రులు హరీశ్రావు, ఇంద్రకర్రెడ్డి, తలసాని, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కలిసి స్వామి వారికి సమర్పించనున్నారు.
మల్లన్న క్షేత్రంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత శనివారం పర్యటించారు. స్వామి వారి కల్యాణం నిర్వహించే ప్రదేశంతో పాటు పరిసర ప్రాంతాలను ఆమె పరిశీలించారు. అనంతరం వీఐపీ, జనరల్ పార్కింగ్, దర్శనం చేసుకునే ప్రదేశాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. బారీకేడ్లతో పాటు వీఐపీల బందోబస్తుపై పోలీస్ అధికారులకు సూచనలు చేశారు. తోటబావి కల్యాణ వేదిక, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ వద్ద వీఐపీలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన బందోబస్తు చేపట్టాలని అడిషనల్ డీసీపీ మహేందర్కు సూచించారు. నూతనంగా నిర్మించిన పోలీస్స్టేషన్ సందర్శించి, పరిసర ప్రదేశాలను శుభ్రం చేసి చదును చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ ఆవరణ చుట్టూ కంచె ఏర్పాటు చేసేందుకు నివేదిక పంపించాలన్నారు. స్టేషన్కు రంగులు, ఫర్నిచర్ తదితర అంశాలపై సూచనలు చేశారు.సీపీ వెంట చేర్యాల సీఐ శ్రీనివాస్, ఎస్సై చంద్రమోహన్, ఈవో బాలాజీ ఉన్నారు.
ఆలయ సంప్రదాయం మేరకు వరుడు మల్లికార్జున స్వామి తరఫున పడిగన్నగారి వంశస్తులు, వధువుల మేడలాదేవి, కేతమ్మదేవీ తరఫున మహదేవుని వంశస్తులు పాల్గొని కల్యాణాన్ని జరిపిస్తారు. ఆదివారం ఉదయం 10:45 గంటలకు కొమురవెల్లి పుణ్యక్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద నిర్మించిన కల్యాణ వేదిక వద్ద బార్సీ మఠాధిపతి మణికంఠ శివాచార్య ఆధ్వర్యంలో కల్యాణం జరుగనున్నది. కల్యాణ వేడుకలను ఆలయవర్గాలు రెండు రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. ఈనెల 18న వేకువజామున 5గంటలకు స్వామి వారికి దృష్టికుంభం(బలిహరణం), 10.45గంటలకు స్వామివారి కల్యాణం, మధ్యాహ్నం 12గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి 7గంటలకు రథోత్సవం(బండ్లు తిరుగుట), 19వ తేదీ సోమవారం ఉదయం 9గంటలకు స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, అనంతరం మహా మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ, మహా మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కృషితో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం దినదినాభివృద్ధి చెందుతున్నది. మల్లన్న ఆలయంలో ప్రత్యేకంగా మరిన్ని సేవలు, వసతులు కల్పించేందుకు రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే స్వామి వారి ఆలయ ద్వారాలు, తలుపులకు వెండి తాపడం పనులు పూర్తి చేయించారు. మల్లన్నకు కొత్తగా బంగారు కిరీటం చేయించారు. కొత్తగా యాదాద్రి తరహాలో క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. 20ఏండ్ల క్రితం
అనివార్య కారణాలతో రద్దు చేసిన పల్లకీసేవను తిరిగి ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. ఆలయ ప్రాంగణంలోని గంగరేగు చెట్టు వద్ద ఇక నుంచి భక్తులు కోడెతో ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం భక్తులు కోడెను స్వామి వారి రాజగోపురం ఎదురుగా ఉన్న పాత అన్నప్రసాద వితరణ శాల మండపం వద్ద కట్టివేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కొత్తగా వచ్చే భక్తులకు కోడెను కట్టేవేసే ప్రదేశం తెలియకపోవడంతో భక్తుల
తాకిడితో కొందరు భక్తులు కోడెను కట్టివేయకుండా వెళ్లిపోతున్నారు.ఇక నుంచి అలా జరగకుండా ప్రత్యేక చొరవ తీసుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక రాష్ట్రంతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది.
ప్రారంభానికి సిద్ధమైన మహామండపం, ప్రసాద తయారీశాల మల్లన్న క్షేత్రంలో మహామండపంతో పాటు ప్రసాద తయారీశాలను మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు. స్వామి వారి కల్యాణం అనంతరం మంత్రి హరీశ్రావు కల్యాణ వేదిక వద్ద విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ గీస భిక్షపతి విలేకరులకు వెల్లడించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మల్లన్నకు బంగారు కిరీటం, కోరమీసం సమర్పించనున్నట్లు చెప్పారు. మహామండపంతో పాటు ప్రసాద తయారీశాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో డైరెక్టర్లు కొంగరి గిరిధర్, సూటిపల్లి బుచ్చిరెడ్డి, నామిరెడ్డి సౌజన్యరెడ్డి, కందుకూరి సిద్ధలింగం, రఘువీర్రెడ్డి, పచ్చిమడ్ల సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవాలను రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజ కార్యక్రమాలకు ఆలయ అర్చకులకు విధులు కేటాయించారు. బలిహరణ(దృష్టికుంభం) నిర్వహణ బాధ్యతలను ఆలయ ప్రధానార్చకుడు మహదేవుని మల్లికార్జున్ నిర్వహిస్తారు. ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహణ బాధ్యతలను మహదేవుని చిన్న మల్లికార్జున్, గర్భాలయంలో స్వామి వారి కల్యాణంలో మహదేవుని సాంబయ్య దంపతులు, పడిగన్నగారి మల్లికార్జున్ దంపతులు పాల్గొంటారు. కల్యాణ వేదిక వద్ద కల్యాణ నిర్వహణ బాధ్యతలను పడిగన్నగారి మల్లయ్య దంపతులు, మహదేవుని రవి దంపతులకు అప్పగించారు. శకటోత్సవం నిర్వహణను మహదేవుని మనోహర్, మహదేవుని వినయ్ చూసుకుంటారు. లక్షబిల్వార్చన ఉదయం పూజల్లో మహదేవుని మనోహర్, సాయంత్రం పూజల్లో మహదేవుని వినయ్ ఉంటారు. కల్యాణవేదిక వద్ద పూర్ణకుంభ స్వాగత బాధ్యతలు పడగన్నగారి ఆంజనేయులు, మహదేవుని మల్లికార్జున్కు అప్పగించారు. రాజగోపురం వద్ద పూర్ణకుంభ స్వాగత కార్యక్రమాలను మహదేవుని వినయ్, మహదేవుని భాస్కర్కు కేటాయించారు.