కంటివెలుగు శిబిరాల వద్ద ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేసుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో క్యాంపుల ఏర్పాటుపై రెండు రోజుల ముందుగానే ప్రచారం చేయాలని, స్థానిక పరిస్థితులను బట్టి ఉదయం గంట ముందు లేదా సాయంత్రం గంట లేటుగా సమయాన్ని మార్చుకోవాలన్నారు. జిల్లాలో కొత్తగా మంజూరైన 23 పల్లె దవాఖానలకు స్థలాన్ని గుర్తించి ప్రతిపాదనలు పంపాలని, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల శాతం 80శాతానికి పెంచాలని సూచించారు. రాబోయే ఎండాకాలంలో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
– మెదక్,(నమస్తే తెలంగాణ) ఫిబ్రవరి 4
మెదక్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో శిబిరాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్తో కలిసి ఆయా శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్తుల అవసరం మేరకు ఉదయం గంట ముందు లేదా సాయంత్రం గంట ఆలస్యంగా ముగించేలా కార్యక్రమం నిర్వహించాలన్నారు. గ్రామాల్లో క్యాంపుల కోసం రెండు రోజుల ముందే ప్రచారం చేయాలన్నారు. కంటి అద్దాలు అవసరమైన వ్యక్తికి ఇచ్చిన తర్వాత ఫొటో తీసి ట్యాబ్లో అప్లోడ్ చేయాలని, ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం డీఈవో అప్లోడ్ చేయాలని తెలిపారు.
కంటి వెలుగు కార్యక్రమంలో ఐకేపీ, ఏపీఎం, డీపీఎం ప్రోగ్రాం అయ్యేంత వరకు ఎంపీడీవోల ఆధ్వర్యంలో కలిసి పనిచేయాలని తెలిపారు. జిల్లాకు 23 పల్లె దవాఖానలు మంజూరయ్యాయని, వాటి కోసం మెడికల్ ఆఫీసర్లు తహసీల్దార్లతో కలిసి 250 గజాల స్థలాన్ని గుర్తించి, ప్రతిపాదనలు పంపాలని సూచించారు. మాతా శిశు సంరక్షణలో భాగంగా ప్రతి గర్భిణీకి మొదటి త్రైమాసికంలోనే వంద శాతం నమోదు చేయాలని సూచించారు. ఇందుకోసం ఐసీడీఎస్, వైద్యారోగ్య శాఖ కలిసి సమన్వయంతో పనిచేసి పూర్తి చేయాలని తెలిపారు. జిల్లా ప్రభుత్వ దవాఖానలో ప్రసవాల సంఖ్య 76 శాతం ఉన్నదని, ఫిబ్రవరి నెలాఖరు వరకు 80 శాతం పెంచాలన్నారు. డెలివరీ కోసం గర్భిణీని దవాఖానకు తీసుకువచ్చే ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్ల కోసం ప్రత్యేక వెయిటింగ్ రూం ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నెలా 1, 15వ తేదీల్లో వీహెచ్ఎన్డీ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.
వీహెచ్ఎన్డీ క్యాలెండర్ తయారు చేసి ఫిబ్రవరి 15 వరకు ఇవ్వాలని సూచించారు. ఎన్సీడీ నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇదిలావుండగా తెలంగాణ క్రీడా ప్రాంగణాలకు ఎంపీడీవోలు, తహసీల్దార్లతో కలిసి ఈ నెల 15 వరకు స్థలాలను గుర్తించి 28 వరకు పనులు పూర్తి చేయాలని తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో వచ్చే ఎండాకాలంలో నీటి కొరత లేకుండా సీఈవోలు, ఎంపీడీవోలు వాటర్ ప్లాంట్లను చూసి నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. సమీక్షలో జడ్పీ సీఈవో శైలేశ్, డీఎంహెచ్వో డాక్టర్ చందూనాయక్, జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటిండెంట్ పి.చంద్రశేఖర్, డీపీవో సాయిబాబా, ఆయా శాఖల అధికారులు, పీహెచ్సీ , కంటి వెలుగు వైద్యాధికారులు పాల్గొన్నారు.