సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 20 : విపత్తులు సంభవించిన సమయంలో ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) నిర్వర్తించే పాత్ర ఎంతో కీలకమని సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్డీఆర్ఎఫ్ విజయవాడ 10వ బెటాలియన్ ఇన్స్పెక్టర్ ముఖేశ్కుమార్ ఆధ్వర్యంలో జిల్లా లో 15 రోజులపాటు విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రతలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులకు విపత్తులు సంభవించినపుడు ఏ విధంగా కాపడుకోవాలని? అంశంపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాలతో జరిగే వివిధ రకాల విపత్తులు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి? అప్పటికప్పుడు ప్రాణ నష్టం జరుగకుండా ఏవిధంగా కాపాడాలి? ముందస్తు తీసుకోవాల్సిన చర్యలు? ఇతర విషయాలపై ఎన్డీఆర్ఎఫ్ బృందం ప్రజలకు వివరిస్తారన్నారు.
బాంబు, ఇతర పేలుళ్ల్లు సంభవించినప్పుడు, ప్రమాదకర రసాయనాలు విడుదలైన సందర్భాల్లో ఎలా వ్యవహరించాలి? ప్రమాదా ల్లో చిక్కుకున్నవారిని ఎలా కాపాడాలి? ప్రమాదం జరుగకుండా ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తారని వెల్లడించారు. అధిక వర్షాలకు జిల్లాలో ఎలాంటి ఘటనలు జరగకుండా అప్రమత్తం గా ఉండాలని అధికారులకు సూచించారు. గజ ఈతగాళ్లకు సంబంధించిన వివరాలను మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్లు, ఎంపీడీవోలకు అందజేయాలని మత్స్యశాఖ అధికారికి సూచించారు. విపత్తు జరిగినప్పుడు బాధ్యతగా వెంటనే స్పందించాలన్నారు.
స్థానిక విపత్తులపై అవగాహన ఉండాలి
అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మాధురి మా ట్లాడుతూ.. గతంలో జిల్లాలో జరిగిన పలు అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కువగా సంభవించే వైపరీత్యాలను ఎదుర్కోవడానికి స్థానికంగా ఏం చేయాలి? అనే ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని సూచిం చారు. అగ్నిప్రమాదాలు, అధిక వర్షాలు, పరిశ్రమల్లో జరిగే రసాయన ప్రమాదాలు సంభవించినప్పుడు స్థానికుల సహకారంతో ప్రజల ను కాపాడాలన్నారు. 15 రోజుల పాటు నిర్వహించే ఆయా కార్యక్రమాలను సమన్వయం తో సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ మాధురి సూచించారు. సమావేశంలో డీఆర్వో నగేశ్, డీఈవో వెంకటేశ్వర్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.