‘బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే శ్రీరామ రక్ష. కష్టపడిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా గుర్తింపు లభిస్తుంది.’ అని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. పెద్దశంకరంపేట మండలం శివయపల్లి బీరప్ప ఆలయం వద్ద శనివారం రెండో విడత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ గత తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధి, అమలుచేసిన సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను మూడోసారీ అధికారంలోకి తీసుకువస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను వివరించాలని సూచించారు. గతంలో ఉపాధిలేక ప్రజలు వలస వెళ్లేవారని, సీఎం కేసీఆర్ హయాంలో పుష్కలంగా సాగునీరు అందిస్తుండడంతో నేడు ఇతర రాష్ర్టాల వారు పనుల కోసం మన వద్దకు వలస వస్తున్నారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కులాలు, మతాల పేరుతో జనం మధ్య చిచ్చుపెట్టేందుకు కొందరు వస్తున్నారని, అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం కిలోమీటర్లు నడిచి తెచ్చుకునే పరిస్థితి ఉండేదని, మిషన్ భగీరథతో ప్రస్తుతం ఇంటింటికీ శుద్ధనీటిని అందిస్తున్నామని తెలిపారు.
-పెద్దశంకరంపేట, మే 27
పెద్దశంకరంపేట, మే 27: బీఆర్ఎస్ తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలే గెలుపు సూత్రమని, వీటిని పార్టీ నాయకులు, కార్యకర్తలు గడప గడపకూ తిరుగుతూ వివరించాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శనివారం పెద్దశంకరంపేట మండలం శివాయపల్లి బీరప్ప ఆలయం వద్ద నిర్వహించిన రెండో విడత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి మండలంలోని 13 గ్రామాల ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీకి కార్యకర్తలే శ్రీరామ రక్ష అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు వస్తున్నారని, వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. నారాయణఖేడ్ నియోజక వర్గాన్ని గతంలో కాంగ్రెస్ పాలకులు 60 ఏండ్లు పాలనలో ఇందిరమ్మ గృహాలు, మరుగుదొడ్లు, మహిళా రుణాలు అంటూ ప్రజల నుంచి ఇష్టారీతిన దోచుకున్నారన్నారు.
సంక్షేమం, అభివృద్ధితోనే మళ్లీ అధికారంలోకి..
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన సంక్షేమం, అభివృద్ధే తిరిగి మూడోసారీ బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకువస్తాయని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో లేవన్నారు. 75 ఏండ్ల కాంగ్రెస్ నాయకుల పాలనలో రాష్ట్రం పూర్తిగా వెనుకబాటుకు గురైందని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదేండ్లలోనే అభివృద్ధి చేసి చూపించిందన్నారు. కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. పార్టీలో ప్రతికార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, వాకి అండగా ఉంటామని భరోసానిచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ అండదండలతో స్థానికంగా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. పెద్దశంకరంపేట మండలంలో సీసీ రోడ్లు, ఇంటింటికీ నీరు, ఆసరా పింఛన్లు, డబుల్బెడ్రూం ఇండ్లు, రైతుబీమా, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 57 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తుందన్నారు.
మరమ్మతుల పేరుతో జేబులు నింపుకొన్న నాయకులు
చెరువులు, కుంటల మరమ్మతుల పేరుతో వచ్చిన నిధులను అప్పటి కాంగ్రెస్ పాలకు జేబులు నింపుకొన్నారని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆరోపించారు. గతంలో చెరువుల్లో నీళ్లు లేక వలసలు వెళ్లే వారని, మన ప్రభుత్వం తాంబాలంలా ఉన్న చెరువులను గంగాలంలా తవ్వించడంతో రైతులు వలసలకు వెళ్లక గ్రామాల్లో పనులు చేసుకుంటున్నారన్నారు. ఇతర రాష్ర్టాల వారు ఇప్పడు మన వద్దకు వలసలు వస్తున్నారన్నారు. చెరువుల, కుంటల మరమ్మతులతో రైతులు పంటలలో అధిక దిగుబడి సాధిస్తున్నారన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన పాలకులు చెరువులు, కుంటల మరమ్మతుల పేరుతో రూ.12 కోట్లు మంజూరు చేయించుకొని, పనులు చేయకుండా జేబులు నింపుకున్నారన్నారని ఆరోపించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర కల్పించకుండా ఇబ్బందులకు గురి చేసిన ఘనత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు.
ప్రతిపక్షాల మాయమాటలు నమ్మొద్దు
కేంద్ర ప్రభుత్వం తామే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మాయమాటలు చెబుతూ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నదన్నారని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. కాంగ్రెస్. బీజేపీలు తెలంగాణకు ఏమీ చేయలేదని వారి కల్లబొల్లి మాటలు నమ్మొద్దన్నారు. బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ అని తెలంగాణ చెరువులు, కుంటలు మరమ్మతుల సమయంలో, కాళేశ్వరం ప్రాజెక్టు సమయంలో అడిగితే ఒక్క రూపాయి కూడా రాష్ర్టానికి ఇవ్వలేదని, అదే పక్క రాష్ర్టాలైన ఆంధ్రా, కర్ణాటకకు నిధులు మంజూరు చేసిందన్నారు. బేటీ బచావో-బేటీ పడావో అని అంటారు కానీ, ఒక్క పాఠశాల తెరువలేదని, ఎక్కడ పెండ్లిళ్లు జరిగినా ఆదుకోలేదన్నారు. ఒక్క ఇల్లు కూడా కట్టివ్వలేడు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి రైతుల ధాన్యం కూడా కొనడంలేదని, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచాడని విమర్శించారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజీపీ నేతలు కులమతాల పేరుతో చిచ్చు పెట్టేందుకు వస్తున్నారని, వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రం వచ్చాక ఖేడ్ నియోజకవర్గంలో ప్రైవేటు దవాఖానలు మూతపడుతున్నాయని, ప్రభుత్వ దవాఖానలో నార్మల్ డెలవరీలు అవుతున్నాయన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, కార్పొరేట్ తరహాలో కళాశాలలో నాణ్యమైన విద్యనందిస్తున్నదన్నారు. ప్రజలు దవాఖానలో చేరితే సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేస్తున్నామని, నారాయణఖేడ్ నియోజకవర్గంలోనే పెద్దశంకరంపేట మండలానికి అత్యధికంగా అందజేశామన్నారు. నియోజకవర్గంలో రూ.235 కోట్ల రైతుబీమా అందజేశామన్నారు. గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ, నూతనంగా గృహాలు నిర్మించుకునే వారికి గృహలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు.
ఈ సందర్భంగా గొల్లకుర్మలు ఎమ్మెల్యే భూపాల్రెడ్డికి శాలువాకప్పి గొర్రెను బహూకరించారు. అనంతరం మహిళకు కల్యాణలక్ష్మి చెక్కును అందజేశారు. అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీపంతులు, మాజీ ఎంపీపీ బాసాడ రాజు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కుంట్ల రాములు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దత్తు, నాయకులు సురేశ్గౌడ్, వేణుగోపాల్గౌడ్, సుభాశ్గౌడ్, బక్కారెడ్డి తదితరులున్నారు.