దుబ్బాక, నవంబర్ 23 : దుబ్బాకలో ఏటీఎంలో డబ్బులు దొంగతనానికి పాల్పడిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. సంఘటన జరిగిన 24 గంటలలోపే నిందితులను చాకచక్యంగా పట్టుకున్నందుకు దుబ్బాక పోలీసులను సిద్దిపేట ఏసీపీ చల్లా దేవారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా బుధవారం దుబ్బాక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిద్దిపేట ఏసీపీ వివరాలు వెల్లడించారు.
దుబ్బాకలో ఆదివారం అర్థరాత్రి యాక్సిస్ బ్యాం కు ఏటీఎంలో చొరబడి దొంగతనానికి ప్రయత్నించి విఫలమైన సంఘటన కేసులో దుబ్బాక సీఐ మున్నురు కృష్ణ, ఎస్సై మహేందర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృం దంతో నిందితులను పట్టుకున్నారు. నిందితులు దుబ్బాకకు చెందిన బండి నరేశ్, పర్స కరుణాకర్గా సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు తెలిపారు. మంగళవారం వేకువ జామున నిందితులను పట్టుకుని విచారించగా వారు నేరాన్ని అంగీకరించారు.
నిందితులు సులువుగా డబ్బులు దోచుకునేందుకు ఏటీఎంను ఎంచుకున్నారని, ఏటీఎంలో దొంగతనం చేసేందుకు ముందుగా యూ ట్యూబ్లో ఏటీఎంకు సంబంధించిన వీడియోలను చూసి పథకం పన్నినట్లు తెలిపారు. ఏటీఎంలో దొంగతనానికి పాల్పడేందుకు దుబ్బాకలోని ఓ దుకాణంలో గొడ్డళ్లు , సానం దొంగిలించి, అక్కడి నుంచి యాక్సిస్ ఏటీఎం వద్దకు వచ్చి అందులో మిషన్ ను ధ్వంసం చేశారు. డబ్బులు దోచుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని తెలిపారు.