సిద్దిపేట అర్బన్, నవంబర్ 1: మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై గత నెల 30వ తేదీన హత్యాయత్నం చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. బుధవారం సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ వివరాలు వెల్లడించారు. దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని సూరంపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తున్న ఎంపీ ప్రభాకర్రెడ్డిపై మిరుదొడ్డి మండలం పెద్దచెప్యాల గ్రామానికి చెందిన ఘటం రాజు(40) కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడు. ఎంపీ గన్మెన్ ప్రభాకర్ నిందితుడిని పక్కకు నెట్టి ఎంపీని కాపాడాడు. అక్కడినుంచి హుటాహుటిన ఎంపీ ప్రభాక్రెడ్డిని గజ్వేల్ దవాఖానకు, అక్కడి నుంచి హైదరాబాద్లోని యశోద దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై దౌల్తాబాద్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కేసును అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని, ప్రత్యక్ష, పరోక్ష సాక్షులను విచారించి సాంకేతిక నైపుణ్యంతో ఆధారాలు సేకరించినట్లు సీసీ తెలిపారు.
నిందితుడు ఘటం రాజు విలేకరి అని చెప్పుకుంటూ ప్రజల వద్ద డబ్బులు వసూలు చేస్తూ జల్సాలు చేసే వాడని, కానీ అతడిపై ఎక్కడా కేసు నమోదు కాలేదని సీపీ తెలిపారు. ఎంపీ ప్రభాకర్రెడ్డిని చంపాలనే ఉద్దేశంతోనే దుబ్బాక మార్కెట్లో కత్తి కొనుగోలు చేసి హత్యాయత్నం చేసినట్లు తెలిపారు. ఘటన సమయంలో నిందితుడిని అక్కడున్న ప్రజలు కొట్టి గాయపరిచారని.. దీంతో రాజును అదుపులోకి తీసుకొని చికిత్స నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించి చికిత్స చేయించామన్నారు. దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నిందితుడు రాజును తొగుట సీఐ కమలాకర్ బుధవారం అదుపులోకి తీసుకొని విచారించగా అందరి దృష్టి తనపై పడాలనే ఎంపీపై హత్యాయత్నం చేసినట్లు నేరం ఒప్పుకున్నాడని వివరించారు. ఈ ఘటనలో నిందితుడు నేరం చేయడానికి గల ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, ఇందుకు ఎవరైనా సహకరించారా? అనే కోణంలో పూర్తి స్థాయిలో ప్రత్యేక బృందాల ద్వారా విచారణ కొనసాగుతున్నదని వెల్లడించారు.
ప్రజలు, యువకులు, రాజకీయ పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు పెడుతున్నారని, వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సీపీ శ్వేత హెచ్చరించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, దీనిపై ప్రత్యేకంగా సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా అభ్యంతరకర పోస్టులు, తప్పుడు వార్తలు పెడితే వారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని సూచించారు. పారదర్శకంగా, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా యంత్రాంగంతో కలిసి ఏర్పాట్లు చేస్తామన్నారు.
గజ్వేల్, నవంబర్ 1: ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై దాడి చేసిన నిందితుడు రాజును బుధవారం గజ్వేల్ కోర్టులో దౌల్తాబాద్ పోలీసులు హాజరుపర్చారు. నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.