తూప్రాన్, ఏప్రిల్ 14: మెదక్ గడ్డ.. గులాబీ అడ్డా అని మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆదివారం తూప్రాన్లో జడ్పీటీసీ రాణీ సత్యనారాయణగౌడ్ అధ్యక్షతన జరిగిన తూప్రాన్టౌన్, మండల (రూరల్), మనోహరాబాద్ మండలాల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లాతో సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విజన్తో గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధిలో 50 ఏండ్లు ముందుకు దూసుకుపోయిందన్నారు. పేదలు, మహిళలు, యువతకు సేవ చేయాలనే లక్ష్యంతో రూ. 100 కోట్లతో పీవీఆర్ ట్రస్టు ఏర్పాటు చేస్తానన్నారు. యువత ఉపాధికి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, పోటీ పరీక్షలకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి తదనంతరం జాబ్ మేళాల ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకుల కోసం ఏడు నియోజకవర్గాల్లో ఫంక్షన్హాళ్లు నిర్మించి కేవలం ఒక్క రూపాయి నామమాత్రపు రుసుముకే అందిస్తానన్నారు. ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కులం, మతం పేరుతో బీజేపీ నాయకులు ఓట్లు అడగడానికి వస్తున్నారని, వారి మాటలను నమ్మవద్దన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అమలు చేయడంలో చతికిల పడిందన్నారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. సమా వేశంలో మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, తూప్రాన్ మండల అధ్యక్షుడు బాబుల్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సతీశ్ చారి, మనోహరాబాద్ ఎంపీపీ నవనీతారవి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాఘవేందర్గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, నాయకులు మాచిరెడ్డి కృష్ణారెడ్డి, ఎక్కల్దేవ్ వెంకటేశ్ యాదవ్, చక్రవర్తి, పల్లె చంద్రారెడ్డి, ప్రభాకర్రెడ్డి, మన్నె శ్రీనివాస్, కుమ్మరి రమేశ్, గుమ్మడి శ్రీనివాస్, అంజాగౌడ్, షేక్ సత్తార్, మైనార్టీ పట్టణ అధ్యక్షుడు బురాన్, నాగరాజు, అహ్మద్, మహేందర్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.