రేగోడ్, మార్చి 22: మెదక్ జిల్లా రేగోడ్ మండలం తాట్పల్లి రోడ్డు దగ్గర మిషన్ భగీరథ పంప్హౌస్ వద్ద ఈ నెల 20న దారి దోపిడీ జరిగింది. కిరాణా షాప్ ఐటీసీ డిస్ట్రిబ్యూటర్ నామా రవికిరణ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను 36 గంటల్లోనే పట్టుకున్నారు. రేగోడ్ పోలీస్స్టేషన్లో బుధవారం ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో డీఎస్పీ సైదులు ఈ కేసు వివరాలను వెల్లడించారు. ప్రధాన నిందితుడు మహమ్మద్ అహ్మద్ జహీరాబాద్లోని ఆనంద్ కిరాణా జనరల్ స్టోర్ ఐటీసీ డిస్ట్రిబ్యుట్లో వ్యాన్ డ్రైవర్గా పనిచేసేవాడు. నెలకు రూ.16500 జీతం తీసుకునేవాడు.
దురాశతో కలెక్షన్ డబ్బు కాజేందుకు పథకం పన్నాడు. మొత్తం 11 మంది నిందితుల్లో ప్రధాన నిందితుడు మహమ్మద్ అహ్మద్ కాగా, మరో 10 ఈ కేసులో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అహ్మద్కు సహకరించినవారిలో మహమ్మద్ అన్వర్, మీర్జా కాసిఫ్, మహమ్మద్ సైఫ్ఖాన్, ఎండీ సుఫాన్, ఎండీ బుర్హాన్, ఎండీ మంజూర్, మహమ్మద్ సమీర్, మహమ్మద్ అర్షాద్, మహమ్మద్ మస్తాన్, ఎండీ అర్షాద్ ఉన్నారు. వీరందరూ 20 నుంచి 26 వయస్కులే. ఒకే గ్రామం జహీరాబాద్, ఒకే కమ్యూనిటీ చెందినవారు. కలెక్షన్స్ పెద్ద మొత్తం ఉండటంతో ఎలాగైనా సదరు మొత్తాన్ని దోచుకోవాలని రెండు నెలల క్రితమే తన స్నేహితుడు మీర్జా కాసిఫ్కు విషయం తెలిపాడు.
తనకు తెలిసిన మరో ఏడుగురికి డబ్బు ఆశచూపి దోపిడీకి సహకరించమన్నారు. వీరందరు జహీరాబాద్లోని రైల్వేస్టేషన్ ఈద్గా వద్ద ఈ నెల 18వ తేదీన కలుసుకొని ప్లాన్ వేసుకున్నారు. పథకం ప్రకారం సోమవారం ఉదయం డీసీఎంలో సరకులు జహీరాబాద్ నుంచి లోడ్ చేసుకుని యథావిధిగా వట్పల్లి, అల్లాదుర్గ్, పెద్దశంకరంపేట పరసర ప్రాంతాల కిరాణా షాపుల్లో సరకులు ఇచ్చేసి, కలెక్షన్ తీసుకుని బయలుదేరేటప్పుడు అహ్మద్ తన స్నేహితుడు మీర్జా కాసిఫ్కు ఫోన్ చేశాడు. అతను సైఫ్ఖాన్కు ఫోన్ చేసి ఒక కత్తి, కర్రలు, కారం పొడితో బయలుదేరమని చెప్పాడు. గ్లామర్, అపాచీ, ఎఫ్జడ్ బైకు మీద 10 మంది నిందితులు లింగంపల్లి బోరంచ కమాన్ వద్దకు చేరుకున్నారు.
డీసీఎం అక్కడికి రాగానే డీసీఎంను వెంబడించి, బైక్లను అడ్డుగా పెట్టి చుట్టుముట్టారు. సైఫ్, సుఫియాన్, మంజూర్ డీసీఎం డ్రైవర్ అహ్మద్ను పక్కకు నెట్టేసి అందులో ఉన్న శ్రీకాంత్, సుధాకర్పై కారంపొడి చల్లి వాళ్లదగ్గర ఉన్న డబ్బుల బ్యాగును తీసుకునే క్రమంలో సైఫ్ కత్తితో దాడిచేశాడు. సుధాకర్ చేతికి గాయమైంది. వారి వద్ద నుంచి ఫోన్లు, బ్యాగు, డీసీఎం తాళాలు తీసుకెళ్లి రాయిపల్లి మంజీర నదిలో పారవేశారు. దోచుకున్న సొమ్ము రూ.7 లక్షల 46 వేల 411 నగదును ముందుగా అనుకున్న వాటాల ప్రకారం జహీరాబాద్లో పంచుకున్నారు. బుధవారం ఉదయం పోలీసులు రాయిపల్లి దగ్గర 11 మంది నిందితులను పట్టుకున్నారు.
కేసును ఛేదించడంలో సహకరించిన జహీరాబాద్, వట్పల్లి, అల్లాదుర్గ్, పెద్దశంకరంపేట పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. 36 గంటల్లో కేసు ఛేదించిన సీఐ జార్జ్, ఏఎస్సై మల్లయ్య, సిబ్బందిని ప్రశంసించారు. రూ.6,70,000 నగదు స్వాధీనం చేసుకొని, నిందితులందరినీ రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు.