మెదక్,(నమస్తే తెలంగాణ) డిసెంబర్2: జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ దవాఖాన ప్రసూతి సేవల్లో ఆదర్శంగా నిలుస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఏంసీహెచ్లో ఏర్పాటు చేసిన సమవేశంలో మెదక్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మార్గదర్శనంలో ఏంసీహెచ్లో కార్పొరేట్కు దీటుగా అధునాతన సౌకర్యాలు కల్పించామన్నారు. దవాఖానలో వైద్యులు, సిబ్బంది చిత్తశుద్ధితో, బాధ్యతాయుతంగా విధులు నిర్వరిస్తున్నారన్నారు. గర్భిణులు, ఇతర రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ దవాఖానలో నవంబర్లో రికార్డు స్థాయి లో ప్రసవాలు జరిగాయన్నారు.
జిల్లా చరిత్రలోనే 407 ప్రసవాలు చేసి వైద్యులు, సిబ్బందికి తమ విధులపై తమకున్న బాధ్యతను చాటుకున్నారన్నారు. ఇందులో 209 సాధారణ ప్రసవాలున్నాయన్నారు. దవాఖాన సూపరింటెండెంట్గా డాక్టర్ చంద్రశేఖర్, గైనకాలజిస్ట్ డాక్టర్ శివదయాల్, మత్తు స్టాప్ నర్సు బృందం ఏంసీహెచ్లో రాత్రింబవళ్లు గర్భిణులకు వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. బాబు జన్మిస్తే రూ.12వేలు, ఆడశిశువు జన్మిస్తే రూ.13 వేలతో పాటు కేసీఆర్ కిట్ అందజేస్తున్నారన్నారు. ప్రసవానంతరం తల్లీబిడ్డలను ఉచితంగా వాహనంలో ఇంటికి చేర్చుతున్నట్లు చెప్పారు. మరిన్ని వసతులు కల్పించి ఎక్కువ ప్రసవాలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సూపరింటెండెంట్ చంద్రశేఖర్, గైనకాలజిస్ట్ డాక్టర్ శివదయాల్ను ఘనంగా సత్కరించారు.
ఎంసీహెచ్లో నవంబర్లో 407 ప్రసవాలు జరిగాయి. మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి నెలకొల్పిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒకే నెలలో ఈ స్థాయిలో ప్రసవాలు చేయడం ఇదే ప్రథమం. గైనకాలజిస్ట్ డాక్టర్ శివ దయాల్ బృందం సెప్టెంబర్లో 377 ప్రసవాలు, అక్టోబర్లో 384 ప్రసవాలు చేశారు. .
నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ముందుంటున్నారు. ప్రతి నెల 2,16 తేదీల్లో ఎమ్మెల్యే అధికారులతో కలిసి క్యాంపు కార్యాలయంలో మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గంలోని మెదక్, పాపన్నపేట, రామాయంపేట, నిజాంపేట, శంకరంపేట ఆర్, హవేళీఘనపూర్ మండలాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు, రెవెన్యూకు సంబంధించిన సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అక్కడే ఉన్న అధికారులతో ఎమ్మెల్యే లేని అధికారులతో ఫోన్ ద్వారా సమస్యలు వివరించి పరిష్కార దిశగా కృషి చేశారు. కార్యక్రమంలో మెదక్ ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు కిష్టయ్య, ఏడుపాయల దేవస్థానం చైర్మన్ బాలగౌడ్, పాపన్నపేట వైస్ ఎంపీపీ విష్ణువర్దన్, పార్టీ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.