ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక కార్యాచణతో ముందుకెళ్తున్నది. విద్యార్థులు చదవడం, రాయడంతో పాటు గణిత చతుర్విద అంశాల్లో సామర్థ్యాలు సాధించేలా చర్యలు తీసుకుంటున్నది. గతంలో ‘త్రీఆర్స్, మూలాల్లోకి వెళ్దాం’ వంటి కార్యక్రమాలు చేపట్టగా ఈ ఏడాది పఠనోత్సవానికి శ్రీకారం చుట్టింది. ‘ప్రతి విద్యార్థి చదివేలా చూడాలి’ అనే నినాదంతో సర్కారు బడుల్లో క్యాంపెయిన్ నిర్వహిస్తున్నది. మెదక్ జిల్లాలోని 920 పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు దీనిని అమలు చేసి అన్ని సబ్జెక్టుల్లో నైపుణ్యం పెంచనున్నారు.
పెద్దశంకరంపేట, జూలై 16: సర్కారు పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. మనఊరు- మనబడి కార్యక్రమంతో సకల వసతులు కల్పించి కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. విద్యార్థుల్లో చదవడం, రాయడంతో పాటు గణిత చతుర్విద అంశాల్లో సామర్థ్యాలు సాధించేలా కృషి చేస్తున్నది. రెండు, మూడు ఏండ్లు త్రీ ఆర్స్, మూలాల్లోకి వెళ్దాం వంటి కార్యక్రమాలు చేపట్టగా ఈ ఏడాది పఠనోత్సవం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి విద్యార్థి చదివేలా చూడాలి అనే నినాదంతో ఈ నెల 31 వరకు క్యాంపెయిన్ నిర్వహిస్తున్నది. ప్రతీ రోజు ఒక పీరియడ్ దీని కోసం కేటాయిస్తున్నారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అమలు చేసి అన్ని సబ్జెక్టుల్లో నైపుణ్యం పెంచనున్నారు.
విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉత్తమమైన, గుణాత్మక విద్యను అందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా చేయాలనేది ప్రభుత్వ సంకల్పం. విద్యాశాఖ లక్ష్యం. చాలా పాఠశాలల్లో హైస్కూల్ వచ్చిన విద్యార్థులకు చదవడం, రాయడం, గణిత అంశాల్లో వెనుకబడి ఉన్నారనేది నేషనల్ అచీవ్మెంట్ సర్వే వెల్లడించింది. దీంతో విద్యాశాఖ వాటిని పెంచేందుకు 2017 ముందు త్రీ ఆర్స్ (చదవడం, రాయడం,అర్థమెటిక్)ను అమలు చేయగా, దాని స్థానంలో 2019-20 సంవత్సరానికి మూలాల్లోకి వెళ్దాం అనే పేరుతో ఏబీసీ (అట్టెన్మెంట్ ఆఫ్ బేసిక్ కాంపిటెన్సీ) కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చింది. ఈ విద్యా సంవత్సరం ప్రతి విద్యార్థి చదివేలా, రాసేలా చూడాలి అనే నినాదంతో పఠనోత్సవం (రీడింగ్ క్యాంపెయిన్)కు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ఈనెల 31 వరకు కొనసాగనున్నది.
1 నుంచి 10వ తరగతి వరకు అమలు
జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, కేజీవీబీ, మోడల్ పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మాతృభాష, గణితం, ఆంగ్ల భాషలో కనీస సామర్థ్యాలు సాధించేలా పఠనోత్సవం (రీడింగ్ క్యాంపెయిన్ ) అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు విరామ కాలం సద్వినియోగం చేసుకునేలా సృజనాత్మక ఆలోచనలు, వ్యక్తీకరణ సామర్థ్యాలకు బాటలు వేసేలా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. రెగ్యులర్ తరగతులకు ఆటంకం కలుగకుండా పాఠ్యాంశాలు బోధించి విద్యార్థులందరూ ధారాళంగా చదువగలిగేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. విదార్థులందరూ పాఠ్య పుస్తకంలోని పాఠాలు, పాఠ్యేతర పుస్తకాలు, కథల పుస్తకాలు, వార్తా పత్రికలు చదివేలా చేయడమే ప్రధాన ఉద్దేశం.
మెదక్ జిల్లాలో920 పాఠశాలలు
మెదక్ జిల్లాలో920 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పఠనోత్సవం అమలు చేస్తున్నారు. వీటిలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 92 వేల 700 మంది విద్యార్థులు నిత్యం పఠనోత్సవం చేస్తూ 31వ తేదీ వరకు విద్యాబోధన చేయాల్సి ఉంటుంది. రోజువారి సబ్జెక్టుల బోధనలకు ఆటంకం కలుగకుండా ఉదయం, సాయంత్రం సమయంలో నేర్పించాలి. జిల్లా విద్యాధికారి నేతృత్వంలో జిల్లా మానిటరింగ్ బృందాలు పర్యవేక్షిస్తాయి. సెక్టోరియల్ అధికారులు మండలంలో ఆకస్మికంగా తనిఖీలు చేస్తారు.
పఠనోత్సవం నిర్వహణ ఇలా
జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పఠనోత్సవం నిర్వహిస్తారు. పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులందరూ కార్యక్రమంలో పాల్గొనాలి. ప్రధానోపాధ్యాయడు నిత్యం పర్యవేక్షించాలి. పుస్తక పఠనం కోసం రోజు ఒక పీరియడ్ కేటాయించాలి. ప్రతి పీరియడ్లో ఉపాధ్యాయుడు తన సబ్జెక్టుకు సంబంధించిన అంశాన్ని విద్యార్థులతో 10 నిమిషాలు బాహ్య పఠనం చేయించాలి. ఇంటి వద్ధ విద్యార్థులు చదివేలా గ్రంథాలయ పుస్తకాలతో పాటు రకరకాల మ్యాగజైన్లు ఇవ్వాలి. వాటిని తల్లిదండ్రులకు చదివి వినిపించమని చెప్పాలి. రోజు ప్రార్థనా సమయంలో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులతో పుస్తకాలను చదివించాలి. విద్యార్థులు చదివే సందర్భంలో వాటిని వీడియో తీసి పాఠశాల గ్రూప్లో షేర్ చేయాలి. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు ప్రతి శనివారం పఠన పోటీలు నిర్వహించాలి.
సామర్థ్యాల పెంపునకే పఠనోత్సవం
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1నుంచి 10వ తరగతి విద్యార్థులకు పఠనోత్సవం చేస్తున్నారు. విద్యార్థులకు నిత్యం తరగతి బోధనాంశాలతో పాటు ప్రత్యేక పీరియడ్ కేటాయించి చదవడం,రాయడం నిర్వహిస్తారు. వాటిలో నైపుణ్యత లేనివారిని గుర్తించి వారిలో సామర్థ్యాలను పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం.
-రాధాకిషన్, డీఈవో, మెదక్
పటిష్టంగా నిర్వహించాలి
పఠనోత్సవ కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో పటిష్టంగా నిర్వహించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి. ఇందులో ఉపాధ్యాయులు, హెచ్ఎంలు, నోడల్ అధికారు నిత్యం పర్యవేక్షణ చేయాలి. విద్యార్థులను ప్రైవేటుకు దీటుగా రాణిస్తున్నారనేలా తయారు చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైంది.
– సుదర్శనమూర్తి. జిల్లా సెక్టోరియల్ అధికారి, మెదక్