కొమురవెల్లి, మార్చి 11 : దేవాదుల పైపులైన్ ద్వారా మండలంలోని తపాస్పల్లి రిజర్వాయర్ నింపి కాలువల ద్వారా మండలంలోని అన్ని చెరువులు, కుంటలకు నీళ్లు వదలాలని సోమవారం సీపీఎం మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి ఆధ్వర్యంలో తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూగర్భజాలాలు తగ్గిపోయి బోర్లు నీళ్లు పోసే పరిస్థితి లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు.
చెరువులు, కుంటల్లోకి నీళ్లు వదిలి రైతాంగాన్ని ఆదుకోవాలని, లేనిపక్షంలో రైతులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణారెడ్డి, తాడూరి రవీందర్, తేలు ఇస్తారి, ఉల్లంపల్లి సాయిలు, సార్ల యాదయ్య, తడకపల్లి శ్రీనివాస్, సున్నం యాదయ్య, ఆరుట్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.