సిద్దిపేట, జనవరి 29 : తల్లిపాలు పిల్లలకు అమృతం లాంటివని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట విపంచి కళానిలయంలో శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గర్భిణులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడుతూ.. తల్లి గర్భంతో ఉన్నప్పుడు తీసుకునే ఆహారం పుట్టబోయే బిడ్డ మీద ప్రభావాన్ని చూపుతుందన్నారు. అమ్మ అంటే అందరికీ ఇష్టం… ఆ అమ్మను మరింత బలోపేతం చేసేందుకు రామకృష్ణమఠం వారు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి తల్లి తనకంటే అద్భుతమైన జీవితాన్ని బిడ్డ పొందాలని కోరుకుంటుందన్నారు. గులాబీ అధినేత కేసీఆర్ గర్భిణుల కోసం కేసీఆర్ కిట్ పథకం అమలు చేశారని గుర్తుచేశారు. గ్రామాల్లో ఉండే పేద మహిళలు పనులకు వెళ్లే క్రమంలో ఇబ్బంది పడుతున్నారని, గర్భంతో ఉన్న సమయంలో పనులకు వెళ్లొద్దని సూచించారు. హిందువులైతే భగవద్గీత చదవండి, సంగీతం విని మంచి పుస్తకాలు చదివించాలని, అది పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతుందన్నారు.
అతి ఎకువగా (90 శాతం) సీ సెక్షన్ డెలివరీలు తెలంగాణలో జరుగుతున్నాయన్నారు. కానీ సాధారణ డెలివరీలో పుట్టే పిల్లలు చురుగ్గా ఉంటారన్నారు. మొదటి గంట తల్లిపాలు అమృతంతో సమానమన్నారు. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు ,ఆశ వరర్లు, హెల్త్ సిబ్బంది మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో ‘ఆరోగ్యలక్ష్మి’ కార్యక్రమం అమలు చేసి పాలు, కోడిగుడ్డుతో అన్నం వడ్డించామని గుర్తుచేశారు. కడుపులో బిడ్డ పడగానే ఐరన్ సిరప్లు, కేసీఆర్ న్యూట్రీషన్ కిట్స్ ఇచ్చామన్నారు. సాధారణ డెలివరీల కోసం గర్భిణులకు యోగా నేర్పించేందుకు ప్రతి ఎంసీహెచ్లో ట్రైనర్లు ఉన్నారన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, మున్సిపల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజులారాజనర్సు, రామచంద్ర మిషన్ వైద్యులు అనుపమ, నిహారిక, ఆమని, దీప్తితో పాటు మిషన్ సభ్యులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.