చేర్యాల, జనవరి 28 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో రెండో ఆదివారం లష్కర్వారం సందర్భంగా మల్లన్న క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్తో పాటు కరీంనగర్, మెదక్, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు చెందిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. మల్లన్న స్వామి మమ్మేలు అంటూ నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. శనివారం సాయంత్రం నుంచే ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో భక్తులు మల్లన్న క్షేత్రానికి చేరుకున్నారు.
ఆలయ పరిధిలో దాతల గదులు ఖాళీగా లేకపోవడంతో ప్రైవేటు గదులు కిరాయికి తీసుకుని బస చేశారు. ఆదివారం వేకువ జామునే నిద్రలేచి కోనేటిలో స్నానాలు ఆచరించి క్యూలో వెళ్లి మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. అభిషేకం, అర్చన, ఒడి బియ్యం, కొబ్బరి కాయలు, పట్నాలు, బోనాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి 50వేల మంది భక్తులు వచ్చినట్లు ఆలయ ఈవో బాలాజీ తెలిపారు.
వేకువజామున 5 గంటల నుంచే స్వామివారిని దర్శించుకునేలా ఆలయవర్గాలు తగిన ఏర్పాట్లు చేశాయి. ప్రత్యేక దర్శనం, శీఘ్రదర్శనం, ధర్మదర్శనం తదితర కౌంటర్లను తెరిచి టిక్కెట్లను విక్రయించారు. అనంతరం గుట్టపై ఉన్న ఎల్లమ్మను దర్శించుకుని బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, కమిటీ సభ్యులు, ఏఈవో గంగా శ్రీనివాస్, సూపరింటెండెంట్ నీల శేఖర్, ఆలయ ప్రధాన అర్చకుడు మహాదేవుని మల్లికార్జున్, అర్చకులు, ఒగ్గు పూజారులు, సిబ్బంది భక్తులకు సేవలందించారు.