రాష్ట్ర, జాతీయ స్థాయిలో సిద్దిపేట పేరు లేకుండా అవార్డే ఉండదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళా నిలయంలో జరిగిన దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ మండల స్థాయి పురస్కారాల ప్రదానోత్సవం సిద్దిపేట జిల్లాకేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు సిద్దిపేటకు 30 జాతీయ అవార్డులు వచ్చాయన్నారు. ఏ రంగమైనా సిద్దిపేటనే ఆదర్శమన్నారు. ఇది ఆనాడు కేసీఆర్ వేసిన బాట అని.. అదే మార్గంలో నడుస్తూ జిల్లా ప్రతిష్టను పెంచుకుంటూ వెళ్తున్నామన్నారు. సోషల్ మీడియా రాజ్యమేలుతున్న నేటి కాలంలో సర్పంచ్ మంచి పనులు చేయడం కత్తి మీద సాములాంటిదేనన్నారు. బాగా పనిచేసిన సర్పంచ్లకు కచ్చితంగా గౌరవం, ఆదరణ ఉంటుందన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 85 గ్రామ పంచాయతీలు ఉంటే 60 అవార్డులు అందుకుంటున్నాయని తెలిపారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణ పల్లెల్లో కనబడుతున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంసద్ ఆదర్శ యోజన జాబితాలో పదింట ఏడు అవార్డులు తెలంగాణ పల్లెలే ఉన్నాయన్నారు. ఇది తెలంగాణ సాధించిన గొప్ప విజయమని అభివర్ణించారు.
సిద్దిపేట అర్బన్, మార్చి 23 : అవార్డులు సిద్దిపేటకు కొత్త కాదని, రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డుల్లో సిద్దిపేట పేరు లేకుండా ఉండదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని విపంచి కళా నిలయంలో జరిగిన ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవార్డులు మనలో ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయని, ప్రజాప్రతినిధుల్లో పోటీతత్వాన్ని పెంచి గ్రామాలు మరింత అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతాయన్నారు. ఇప్పటి వరకు సిద్దిపేటకు 30 జాతీయ అవార్డులు వచ్చాయని, అందులో 15 మున్సిపాలిటీకి వస్తే, 15 గ్రామాలకు వచ్చాయని తెలిపారు. ఏ రంగమైనా సిద్దిపేటనే ఆదర్శమన్నారు. ఇది ఆనాడు కేసీఆర్ వేసిన బాట అని, అదే మార్గంలో నడుస్తూ సిద్దిపేట ప్రతిష్టను పెంచుకుంటూ వెళ్తున్నామన్నారు. బాగా పని చేసిన సర్పంచ్లకు కచ్చితంగా గౌర వం, ఆదరణ ఉంటుందన్నారు. పదవి రావడం గొప్ప కాదని, దాన్ని సమర్థవంతంగా నిర్వహించడమే గొప్ప విషయమన్నారు.
గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కనిపిస్తుంది..
సిద్దిపేట నియోజకవర్గంలో 85 పంచాయతీలు ఉంటే 60 పంచాయతీలు అవార్డులు అందుకుంటున్నాయని తెలిపారు. 9 అంశాలను ఆధారంగా చేసుకొని అవార్డులు ప్రకటించినట్లు తెలిపారు. అత్యధికంగా 7 అంశాల్లో నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామం అవార్డు సాధించిందన్నారు. అవార్డులు సర్పంచ్కే కాకుండా గ్రామ ప్రజలకు దక్కిన గౌరవం అన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణ పల్లెల్లో కనబడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంసద్ ఆదర్శ యోజన జాబితాలో పదిలో ఏడు అవార్డులు తెలంగాణ పల్లెలే ఉన్నాయన్నారు. ఇది తెలంగాణ సాధించిన గొప్ప విజయమన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రంలో తప్ప ఏ గ్రామంలోనైనా ప్రతి గ్రామానికి డంపింగ్యార్డు, వైకుంఠధామం, నర్సరీ, ట్రాక్టర్, వాటర్ ట్యాం కర్, రైతు వేదిక ఉంటాయా.. అని అడిగారు.
వేరే రాష్ర్టాల మంత్రులే మన రాష్ర్టాన్ని అభినందిస్తున్నారని తెలిపారు. గ్రామాలకు రివర్స్ మైగ్రేషన్ ప్రారంభమైందన్నారు. నాడు గోరటి వెంకన్న పల్లె కన్నీరు పెడుతుందో అని పాట పాడాడని.. నేడు పల్లెల్లో చూసిన పరవళ్లు తొక్కుతున్న చెరువులు, కుంటలు మాత్రమే ఉన్నాయన్నారు. కరువు అనే మాట సిద్దిపేట డిక్షినరీలోనే లేదన్నారు. నార్మల్ డెలివరీలకు ప్రయత్నం చేయాలని అంగన్వాడీలు, ‘ఆశ’లకు సూచించారు. బిల్లుల విషయం లో సర్పంచ్లు కొంత ఇబ్బందులు పడుతున్నారని, ఇక నుంచి నేరుగా పంచాయతీల అకౌంట్లకే డబ్బులు వస్తాయని, ఎస్టీవో కార్యాలయానికి వెళ్లవని తెలిపారు. పెండింగ్లో ఉన్న రూ. కోటి లోపు ఉన్న బిల్లులను ఈ వారంలోగా చెల్లించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ, అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
భూమికి బరువయ్యేంత పంట పండుతున్నది..
తెలంగాణలో 30 లక్షల కరెంట్ మోటర్లు నడుస్తున్నాయని, రోజుకు రూ.60 నుంచి రూ.70 కోట్లు ఖర్చవుతుందని, నెలకు సుమారు రూ. 1500 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. తెలంగాణలో 16 వేల మోగావాట్ల కరెంట్ అవసరం పడుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉచిత కరెంట్ లేదన్నారు. రైతుల కోసం ఎంతైనా ఖర్చు పెట్టాలని.. సీఎం కేసీఆర్ సూచించారని తెలిపారు. ఆటోమేటిక్ స్టారర్లు అవసరమున్నం త మేరకు మాత్రమే వినియోగించుకునేలా సర్పంచ్లు రైతులకు సూచించాలన్నారు. పంట నష్టపోయిన రైతుకు రూ.10 వేల నష్ట పరిహారం ప్రకటించడం గొప్ప విషయమన్నారు.
భూమికి బరువయ్యేంత పంట తెలంగాణలో పండుతున్నదన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రైతులను అడిగితే మన విలువ తెలుస్తున్నదన్నారు. 60 ఏండ్ల చరిత్ర కలిగి ఉండి, ఆర్థిక రాజధాని ఉన్న మహారాష్ట్రలో తెలంగాణ లాంటి పథకాలు ఎందుకు రావని, మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీ ఎమ్మెల్యే నిలదీశాడని మంత్రి గుర్తుచేశారు. నదికే కొత్త నడకలు నేర్పిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని, గతంలో నంగునూరు పెద్దవాగు నీళ్లు గోదావరిలో కలిస్తే.. నేడు గోదావరి నీళ్లు పెద్దవాగుకు వస్తున్నాయన్నారు. నేడు తెలంగాణలో అవార్డుల పంట పండుతుందన్నారు. అనంతరం అవార్డులు గెలిచిన గ్రామాల ప్రజాప్రతినిధులకు మంత్రి అవార్డులు అందజేశారు.