మెదక్ కలెక్టర్కు దళిత మహిళా ప్రజాప్రతినిధుల ఫిర్యాదు
మెదక్, జూలై 29 : దళిత మహిళా ప్రజాప్రతినిధులను అవమానపర్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావుపై చర్యలు తీసుకోవాలని గురువారం మెదక్ కలెక్టర్ హరీశ్కు జిల్లా ఎంపీపీల ఫోరం ఆధ్వర్యంలో దళిత మహిళా ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేశారు. నార్సింగి మండలం వల్లూరు గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం గురువారం సాయంత్రం 4 గంటలకు జరగాల్సి ఉండగా, అంతకన్న ముందే మధ్యాహ్నం ఒంటి గంటకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు వల్లూరు గ్రామ పంచాయతీ భవవాన్ని ప్రారంభించారు. వల్లూరు గ్రామ పంచాయతీ దళిత మహిళా సర్పంచ్, మహిళా ఎంపీపీలను స్థానిక ఎమ్మెల్యే రఘునందన్రావు అవమానపర్చాడని ఆరోపించారు. గ్రామానికి చెందిన దళిత మహిళా సర్పంచ్ మహేశ్వరి, అదే గ్రామానికి చెందిన మండల అధ్యక్షురాలు చిందం సబితలకు ఎలాంటి సమాచారం లేకుండా ముందస్తుగానే మహిళా ప్రజాప్రతినిధులను కించపరిచేలా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రొటోకాల్ విస్మరించినందుకు, దళిత మహిళలను అవమానపర్చినందుకు గాను ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు హరికృష్ణ, ఉపాధ్యక్షుడు మాసుల శ్రీనివాస్, కార్యదర్శి పురం నవనీత, ఎంపీపీలు యము న, మంజుల, లక్ష్మీ, సిద్ధిరాములు, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
బేషరతుగా క్షమాపణ చెప్పాలి
చేగుంట, జూలై 29 : దళిత మహళా సర్పంచ్ను అవనించిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునంధన్రావు బేషరతుగా క్షమాపణ చెప్పాలని మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు కలోల హరికృష్ణ, ఉపాధ్యక్షుడు మాసుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం చేగుంటలోని మండలపరిషత్ కార్యాలయ వద్ద బాధిత దళిత మహిళౠ సర్పంచ్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గ్రామ సర్పంచ్ ఆనందాస్ మహేశ్వరి, అదే గ్రామానికి చెందిన ఎంపీపీ చిందం సబితను అవమానించినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో ఆయన చేసే ప్రతీ కార్యక్రమాల్లో వ్యతిరేకత తప్పదని, ఏ గ్రామంలో తిరిగే అవకాశం లేకుండా చేస్తామని జిల్లా ఎంపీపీల ఫోరం తరఫున హెచ్చరిస్తున్నట్లు హరికృష్ణ తెలిపారు.
ఒంటెద్దు పోకడలకు పోతే దళితుల ఆగ్రహానికి గురికాకతప్పదు
దళిత మహిళా సర్పంచ్ను అవమానించి, ఒంటెద్దు పోకడలకు పోతే, దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి ఎర్ర యాదగిరి మండిపడ్డారు. చేగుంటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త గ్రామ పంచాయతీ భవనం ప్రారంభంలో దళిత మహిళా సర్పంచ్ను అవమానపరిచేలా 10గంటలకే వచ్చి, సర్పంచ్కు తెలియకుండా ప్రారంభించడం ఎంతవరకు సమజసమన్నా రు. దళిత మహిళను అవమానపర్చినందుకు బేషరుతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఎక్కడా దళితవాడలో తిరుగకుండా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, వల్లూర్ ఎంపీపీ చిందం సబిత, రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్ మ్యాకల పరమేశ్, ముదిరాజ్ సంఘం నాయకులు నర్సింహులు, తెంలగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైలరాం రాంచంద్రం,రాష్ట్ర కార్యదర్శి కొలుపుల స్వామి, జిల్లా అధికార ప్రతినిధి బాలసాయి హరిప్రసాద్, నాయకులు గుడ్డి కృష్ణ, మహేశ్, నరేశ్, ఎల్లం, ప్రశాంత్, ఎరుకుల సంఘం జిల్లా అధ్యక్షుడు కుర్రా లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ మండల నాయకులు చిందం రవీందర్, దాసు, నాగరాజు తదితరులున్నారు.