ఝరాసంగం, జనవరి 10 : బిందుసేద్యంతో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారు. తక్కువ నీటితో ఎక్కువ పంటలు సాగుచేయవచ్చు. గ్రామాల్లోని రైతులు నీటి సౌకర్యం ఉన్న వారు ఎక్కువగా బిందు సేద్యం వైపు మొగ్గు చూపుతున్నారు. రైతులు తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగుచేసే అవకాశం ఉంటుంది. దీంతో సన్న, చిన్న కారు రైతులు ఆధునీక పద్ధతుల్లో వ్యవసాయ అధికారుల సూచనల మేరకు బిందు సేద్యం అలవాటు చేసుకున్నారు. వ్యవసాయ బోరు బావుల్లో నీటి శాతం తక్కువగా ఉన్న క్రమంలో బిందు సేద్యం ఎంతో దోహదపడుతున్నది.
తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి..
మండల కేంద్రమైన ఝరాసంగంతోపాటు బొప్పన్పల్ల, బిడకన్న, పొట్పల్లి, ఈదులపల్లి, జీర్లపల్లి, బోరెగావ్, చీలపల్లి, బర్దీపూర్, మేదపల్లి, చిల్కేపల్లి, కుప్పానగర్ తదితర గ్రామాల్లో బిందు, తుంపర సేద్యం అనుసరిస్తున్నారు. మండల వ్యాప్తంగా ఐదు వేల ఎకరాలకు పైగా పొలాల్లో బిందు, తుంపర సేద్యం ద్వారా పంటలు సాగు చేస్తున్నారు. బిందు సేద్యం ద్వారా ఏ పంట వేసినా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో రోజురోజుకూ బిందుసేద్యం ద్వారా చేసే రైతుల సంఖ్య పెరుగుతున్నది.
పంటల సాగుకు 24 గంటల కరెంట్…
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటలపాటు కరెంట్ అందించడంతో రైతులకు వరంగా మారింది. నిరంతరంగా కరెంట్ సరఫరా చేస్తుండడంతో సాగు చేసిన పంటలకు మరింత దిగుబడి పెరుగుతున్నది. గత ప్రభుత్వాల పాలనలో రైతుల పట్ల నిర్లక్ష్యం వహించి సరైన కరెంట్ అందించకపోవడంతో రైతులు అష్టకష్టాలు పడ్డారు. తెలంగాణ సర్కారు వచ్చాక వ్యసాయానికి నిరంతరం విద్యుత్ అందించడంతో రైతులు ఆనందంతో పంటలు సాగు చేస్తున్నారు.
రైతులకు రాయితీలపై పరికరాలు..
ప్రభుత్వం బిందుసేద్యం ద్వారా పంటలను సాగు చేయాలనే ఉద్దేశంతో రైతులకు రాయితీలపై పరికరాలు అందజేస్తున్నది. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం రాయితీలపై బిందు సేద్యం పరికరాలు అందజేస్తున్నది. ముఖ్యంగా వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిన సమయాల్లో బిందుసేద్యం పరికరాలు ఎంతో ఉపయోగపడుతాయని వ్యవసాయశాఖ విశ్లేషకులు చెబుతున్నారు.
బిందు సేద్యంపై అవగాహన..
వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో రైతులకు బిందు సేద్యంపై అవగాహన కల్పిచినట్లయితే అధిక సంఖ్యలో పరికరాలు ఉపయోగించే అవకాశం ఉంది. నేటికీ కొన్ని గ్రామాల్లో బిందు సేద్యంపై అవగాహన లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో కూడా మార్పులు వస్తేనే రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారని అధికారులు భావిస్తున్నారు.
బిందు సేద్యం బాగుంది..
బిందు సేద్యంతో పంటల సాగు బాగుంది. ప్రభుత్వం రైతులకు 24 గంటలపాటు విద్యుత్ అందించడంతో పంటల సాగుకు ఎలాంటి ఇబ్బందులు లేవు. రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. సీఎం కేసీఆర్ సర్కారును ఎన్నడూ మరిచిపోలేం.
పంటకు చక్కగా నీరు..
బిందుసేద్యం సాగుతో పంటలకు చక్కగా నీరు అందుతున్నది. గతంలో బోరు, బావుల నుంచి వచ్చే నీటిని పంటలకు అందించేది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కూలీలు లేకుండానే పంటకు నీరు అందించవచ్చు. ఈ సాగు విధానంతో పంట దిగుబడి కూడాఎక్కువ వస్తున్నది.