పార్టీలోకి హుజూరాబాద్ కీలక నేతలు
టీజీపీఏ రాష్ట్ర నాయకుడు ‘అంబాల’, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రాజేశ్వర్రావు చేరిక
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి హరీశ్రావు
జమ్మికుంట, జూలై12: టీఆర్ఎస్కు మద్దతు పెరుగుతున్నది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతిపక్షాల కేడర్ మొత్తం ఖాళీ అవుతున్నది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి కీలక నేతలంతా పార్టీలో చేరుతుండగా, గులాబీలో ఫుల్ జోష్ కనిపిస్తున్నది. సోమవారం తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్(టీజీపీఏ)రాష్ట్ర నాయకుడు, దళితరత్న అంబాల ప్రభాకర్(మడిపల్లి), కాంగ్రెస్ జమ్మికుంట మండలాధ్యక్షుడు బల్గూరి రాజేశ్వర్రావు(గండ్రపల్లి) ఆయా సంఘం, పార్టీకి రాజీనామా చేసి ప్రగతి భవన్లో మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరగా, కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
టీఆర్ఎస్కు మద్దతు పెరుగుతున్నది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి హుజూరాబాద్ నియోజకవర్గంలోని కీలక నేతలంతా పార్టీలో చేరుతున్నారు. స్వేరోస్ అనుబంధ సంఘం తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ (టీజీపీఏ) రాష్ట్ర నాయకుడు, సాంస్కృతిక కళాకారుడు, దళితరత్న అంబాల ప్రభాకర్(మడిపల్లి), కాంగ్రెస్ జమ్మికుంట మండలాధ్యక్షుడు బల్గూరి రాజేశ్వర్రావు(గండ్రపల్లి) ఆయా సంఘం, పార్టీకి రాజీనామా చేసి సోమవారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు పార్టీ వైపు నడిపించాయని ప్రభాకర్, రాజేశ్వర్రావు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలు, నల్ల చట్టాలను అమలు చేస్తున్న బీజేపీకి హుజూరాబాద్ నియోజకవర్గంలో స్థానం లేదని, మతతత్వ పార్టీలో చేరిన ఈటలను ఓడించడమే ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, సమస్యల్లేని నియోజకవర్గంగా తయారు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, నాయకులు సంజీవరెడ్డి, ప్రసాద్ ఉన్నారు.
పథకాలు నచ్చే పార్టీలోకి..
ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ తన ప్రాణాలను పణంగా బెట్టిండు. ఒంటి చేత్తో రాష్ర్టాన్ని తెచ్చిండు. 70ఏళ్లలో జరుగని అభివృద్ధిని ఏడేళ్లలో చేసి చూపిండు. ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నన్ను పార్టీ వైపు నడిపించినయ్. దేశంల ఎక్కడా లేని విధంగా పాలన సాగిస్తున్నడు. బంగారు తెలంగాణగా తయారు చేస్తున్నడు. ఎస్సీ, ఎస్టీలకు సబ్ప్లాన్ నిధులు సక్రమంగా అందేలా చూస్తున్నడు. దళితులకు పెద్దపీట వేసిండు. ఇంకేం కావాలే ప్రజలకు. సార్తోనే ఉంటం. పనిజేత్తం. టీఆర్ఎస్ను గెలిపించుకుంటం.
బీజేపీకి ఇక్కడ స్థానం లేదు..
బీజేపీ మతతత్వ పార్టీ. ప్రజా వ్యతిరేక విధానాలు అమల్జేస్తంది. రైతులను అణచివేత్తంది. నల్ల చట్టాలు తెచ్చింది. ఉసురుబోసుకొంటంది. అట్లాంటి పార్టీల ఈటల జేరిండు. ఎట్లా ఊళ్లల్ల తిరుగుతడు. ఓట్లెట్లా అడుగుతడు. మేమెట్లెత్తం. టీఆర్ఎస్ల ఉన్నప్పుడు ఎవల్నిదగ్గర్రానిచ్చిండు. అంతా నేనే అన్నట్టుజేసే. ఇప్పుడు అట్లనే జేత్తడు. టీఆర్ఎస్ రైతుల దిక్కున్నది. రైతుబంధు, రైతు బీమా ఇచ్చి ఆదుకుంటుండే. పింఛన్లియ్యబట్టే. ఇగ ఆ పార్టీకి తప్ప, ఎవరికి సపోట్ చెయ్యం. అందుకే పార్టీలజేరినం. సీఎం నాయకత్వంలో పనిజేత్తం. ఇక్కడ ఎవల్నిబెట్టినా గెలిపించుకుంటం.