నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 9: వేర్వేరు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్ ప్రాంతానికి చెందిన గోసంగిచింతల అర్జున్ (30), భార్య లక్ష్మి, కుమారులు సారలయ్య, సాంబయ్యతో కలిసి ద్విచక్ర వాహనంపై బోధన్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తుండగా సాటాపూర్ గేట్ వద్ద వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో అర్జున్ అక్కడికక్కడే మృతిచెందాడు. అతని భార్య లక్ష్మి, కుమారులు గాయపడ్డారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట సమీపంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ మహేశ్కుమార్ (35) అక్కడికక్కడే మృతిచెందగా.. కారులో ఉన్న కడప జిల్లా వేముల మండ లం శేషన్నగారిపల్లికి చెందిన నాగరాజునాయుడు, ఆయన భార్య నాగలక్ష్మమ్మ (51)కు తీవ్రగాయాలు అయ్యాయి. వనపర్తి ఏరియా దవాఖానలో చికిత్సపొందు తూ నాగలక్ష్మమ్మ మృతిచెందారు. హైదరాబాద్లో ఉంటున్న నాగరాజునాయుడు కుమారుడు రవి వద్దకు వచ్చి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బంధువు అంత్యక్రియలకు వెళ్తుండగా సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని గుంపుల తిరుమలగిరి శివారులో వాహనం బోల్తాపడిన ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఏపీలోని తాడేపల్లిగూడేనికి చెందిన అంబూరి లక్ష్మి హైదరాబాద్ కూకట్పల్లిలో స్థిరపడ్డారు. తాడేపల్లిగూడెంలో బంధువు అంత్యక్రియలకు శనివారం రాత్రి బంధువులతో కలిసి బయలుదేరగా వీరి వాహనం సూర్యాపేట శివారులో బోల్తాపడింది. ప్రమాదంలో ఏడుగురు గాయపడగా.. చికిత్సపొందుతూ ఆదివారం సామాడ ఉదయ్భాస్కర్(26), అంబూరి లక్ష్మి(28) మృతి చెందారు.