దుబ్బాక, నవంబర్ 29: శాసనసభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. దుబ్బాక నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మోడల్స్కూల్లో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ ఏర్పాట్లు జరిగాయి. ఈవీఎం, బ్యాలేట్ యూనిట్, వీవీప్యాట్లతో సిబ్బందిని బస్లలో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. పోలీసు బందోబస్తుతో సిబ్బందిని, ఎన్నికల సామగ్రిని తరలించారు. నేడు (గురువారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగనుంది. ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 1,98,100 మంది ఓటర్లున్నారు. ఇందులో 1,01,081 మంది మహిళలు, 97,019 మంది పురుషులున్నారు. మొత్తం 253 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలో సమస్యాత్మక పోలింగ్కేంద్రాల వద్ద భారీగా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
దుబ్బాక నియోజకవర్గంలో 253 పోలింగ్ కేంద్రాలకు 27 రూట్లు, 110 బస్లు, 27 మంది సెక్టోరియల్ అధికారులు, 253 మంది పోలింగ్ అధికారులు(పీవో), 253 మంది ఎపీవో(అసిస్టేంట్ పోలింగ్ అధికారులు), మరో 516 మంది ఓపీవోలతో పాటు మరో 20 శాతం అధనపు సిబ్బందిని నియమించినట్లు దుబ్బాక రిటర్నింగ్ అధికారి గరిమా అగర్వాల్ తెలిపారు. వందమంది మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. లచ్చపేట మోడల్ స్కూల్ నుంచి బుధవారం మధ్యాహ్నం రిటర్నింగ్ అధికారి గరీమా అగర్వాల్ నేతృత్వంలో పోలింగ్ కేంద్రాల అధికారులు, సిబ్బందికి పోలింగ్ సామగ్రి అందజేసి రూట్ల వారీగా పోలింగ్ కేంద్రాలకు తరలించారు. పోలింగ్ సంబంధించిన యంత్రాలు(ఈవీఎం, వీవీ ప్యాట్), సిబ్బంది తరలింపును ఆర్వో గరిమా అగర్వాల్తో కలిసి ఎన్నికల పరిశీలకుడు మన్మోహన్ ప్రసాద్ పరిశీలించారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి పీఎస్ కంట్రోల్ యూనిట్-1, బ్యాలేట్ యూనిట్-2, వీవీ ప్యాట్-1 చొప్పున పోలింగ్ అధికారులకు అందజేశారు. ఒక పోలింగ్ కేంద్రానికి ఐదుగురుని నియమించారు.
నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు భారీ గా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో మొత్తం 253 పోలింగ్ కేంద్రాలకు 27 రూట్ సెక్టర్లు ఏర్పాటు చేశారు. ఇందులో 51 సమస్యాత్మక పోలింగ్ కేం ద్రాలున్నాయని, అక్కడ బందోబస్తు పెంచినట్లు నియోజకవర్గ పోలీసు నోడల్ అధికారి మల్లారెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో సూమారు 800కు పైగా పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇందులో ఒక అడిషనల్ డీసీపీ/ఏసీ పీ, ముగ్గురు సీఐలు, 10 మంది ఎస్ఐలు, 30 మంది ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు, 200 మంది పోలిసు కానిస్టేబుళ్లు, 50 మంది మహిళా పోలీసులు, 250 హోంగార్డులు, 154 ఎస్ఎస్బీ సిబ్బందిని నియమించారు. ఇందుకు 23 రూట్ మోబైల్స్, 13 స్ట్రక్కింగ్ ఫోర్స్, 3 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఎడుగురు చొప్పున పోలీసు సిబ్బంది ఉంటారు.
నియోజకవర్గంలో 253 పోలింగ్ కేంద్రాలుండగా, ఇందులో 9 పోలింగ్ కేంద్రాలను ఆదర్శ పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. ఇందులో మహిళా, పీడబ్ల్యూడీ పోలింగ్ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. మోడల్ పోలింగ్ కేంద్రాల్లో దుబ్బాక ప్రైమరీ పాఠశాల(పోలింగ్ కేంద్రం నెం.34), మిరుదొడ్డి మండలం అందె ప్రభుత్వ ఉన్నత పాఠశాల(102), దౌల్తాబాద్ మండలం కొనాయిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల(200), అక్బర్పేట-భూంపల్లి మండలం పోతారెడ్డిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల(20), తొగుట ప్రభుత్వ ఉన్నత పాఠశాల(129), రాయపోల్ మండలం కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల(182), నార్సింగ్ మండలం పోతాన్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల (252), నర్సింగ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(211), చేగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల(226) కేంద్రాలను ఆదర్శ పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు మహిళా మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో దుబ్బాక మున్సిపల్ పరిధిలో చేర్వాపూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల(56), దుంపలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల(50), మిరుదొడ్డి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల(96), దౌల్తాబాద్ మండలం గాజులపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (146) కేంద్రాలున్నాయి. దుబ్బాక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీడబ్ల్యూడీ పోలింగ్ కేద్రం ఏర్పాటు చేశారు.