చేగుంట, అక్టోబర్ 26: మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పెద్దశివునూర్లో కల్తీకల్లు తాగి వందమంది అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో వాంతులు విరేచనాలు కావడంతో సర్పంచ్ ముదాం రుక్మిణీబాయి, చేగుంట జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, వైద్యసిబ్బంది అప్రమత్తమై గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేయించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఎవరికీ ఎలాంటి ప్రాణహాని లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గ్రామంలోని కల్లు యజమానులు కల్లులో వాడే మందు ఎక్కువ కలపడంతోనే ఇలా జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు.
మంగళవారం ఒక్కరోజు 73 మంది, బుధవారం 27 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో 8మంది పరిస్థితి విషమించడంతో కొందరిని హైదరాబాద్లోని గాంధీ దవాఖానకు, కొందరిని తూప్రాన్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. గ్రామంలోని చేగుంట ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్య బృందం పగడయ్య, కిషన్, నర్సింహులు, రాంగోపాల్, సూపర్వైజర్ పద్మ, ఏఎన్ఎం కాంత, ఆశ కార్యకర్తలు ఎప్పటికప్పుడు కావాల్సిన మందులు, అవసరమున్న వారికి స్లైన్లు ఎక్కిస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా పంచాయతీ అధికారి తరుణ్కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ కమలాకర్, డిప్యూటీ ఈఈ శ్రీనివాస్, ఏఈ వెంకటేశ్ అస్వస్థతకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వైద్యాధికారి విజయనిర్మల పెద్ద శివునూర్ గ్రామాన్ని సందర్శించి రోగుల ఆరోగ్య పరిస్థితి, వైద్యులు అందిస్తున్న సేవలను పరిశీలించారు. అనంతరం గ్రామంలో పర్యటించి శానిటైజేషన్ సమస్యలు ఎక్కడా కనిపించడం లేదన్నారు. ఎవరికీ ప్రాణహాని లేదని, ప్రతిఒక్కరికీ మెరుగైన చికిత్స అందిస్తామని, గ్రామంలోని ప్రతి ఒక్కరూ పూర్తిగా కొలుకునే వరకు వైద్యశిబిరం పర్యవేక్షిస్తుందని తెలిపారు.