సంగారెడ్డి, ఆగస్ట్టు 1 : సమాజంలో అన్యోన్యంగా ఉండేది స్నేహితులు ఒక్కరేనని, వారి తర్వాతే భార్యాభర్తలకు స్థానం ఉంటుందని, నిజమైన స్నేహనికి స్వార్థం ఉండదని రోటరీ క్లబ్ ఆఫ్ మంజీర అధ్యక్షుడు భూమయ్య అన్నారు. ఆదివారం అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని స్థానిక రెడ్లస్ హోటల్లో ఆనందోత్సాహలతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి స్నేహితులుగా ఒకరినొకరు అర్థం చేసుకుని ఉన్నపుడే వారి మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తవన్నారు. లాభ న ష్టాలు, సుఖ సంతోషాలలో కలిసి మెలిసి ఉంటూ సమాజంలో పది మందికి ఉపయోగపడే పనులు చేసి ఆదర్శంగా నిలబడే స్వభావం స్నేహితులకే ఉంటుందని గుర్తుచేశారు. క్లబ్ తరపున భవిష్యత్లో స్నేహ భావంతో కలిసి పోయే కార్యక్రమాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి సమాజంలో క్లబ్ పాత్రను విస్తరిస్తామన్నారు. రోడ్లపై మాస్కులు లేకుండా తిరుగుతున్న వాహనదారులు, బాటసారులకు మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి నాగిరెడ్డి, సీనియర్ నాయకులు లింగాగౌడ్, సభ్యులు పాండురంగం, శ్రీనివాసులు, రవి, రమేశ్, చందర్, దశరత్, కిషన్, చంద్రమోహన్, ప్రభాకర్, కమలాకర్ రాజు, జీవరత్నం పాల్గొన్నారు.
బొల్లారంలో…
బొల్లారం, ఆగస్టు 1 : మున్సిపాలిటీకి చెందిన యువకులు స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు. స్నేహానికి అద్దం పట్టేలా ప్రతిఒక్కరూ కలిసి దోస్తీ బ్యాండ్లు కట్టుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్థానిక యువకులు మాజీ జడ్పీటీసీ, టీఆర్ఎస్ నాయకుడు కొలన్ బాల్రెడ్డిని ఆయన నివాసంలో కలిసి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.