మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 14: చెడుపై మంచి, పాపముపై నీతి, మరణంపై జీవం సాధించిన విజయానికి నిదర్శనం గుడ్ఫ్రైడే (శుభ శుక్రవారం). ఈ దినం పాపం, మరణం, సాతానుపై క్రీస్తు విజయం సాధించాడు గనుక క్రైస్తవులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ రోజును సిలువపై క్రీస్తు పొందిన త్యాగపూరితమైన మరణాన్ని స్మరించుకునే దినంగా పాటిస్తారు.
శత్రువులను ప్రేమతో క్షమించాలి
శత్రువులను కూడా ప్రేమతో క్షమించాలని సూచించాడు పరమాత్ముడు. ఈ రోజునే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. గుడ్ ఫ్రైడే అనే పదం గాడ్స్ ఫ్రైడే అనే పదం నుంచి వచ్చింది. ఇజ్రాయిల్, నజరేత్ పట్టానికి చెందిన యేసుక్రీస్తును అక్కడి ప్రజలు క్రైస్తవుల ప్రేమమూర్తిగా, లోక రక్షకుడిగా కొలుస్తారు. ఇది నచ్చని యూదా ప్రవక్తలు, మత పెద్దలు కలిసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, తానే దేవుడి ప్రతినిధిగా ప్రచారం చేసుకుంటున్నాడని తప్పుడు ప్రచారం చేస్తారు. చక్రవర్తికి పన్నులు కట్టనక్కర్లేదని, యేసుక్రీస్తుపై నిందలు మోపుతూ రోమన్ చక్రవర్తి ముందు హాజరుపరుస్తారు. చక్రవర్తి మాత్రం ఆ ఆరోపణలను నమ్మలేడు. ఎలాగైనా యేసును హతమార్చాలని చక్రవర్తిపై మరింత ఒత్తిడి చేసి సిలువ వేసే వరకు తీసుకొస్తారు. సిలువ వేసే ముందు యేసుక్రీస్తు తలపై ముళ్ల కిరీటం ధరింపజేసి, రాళ్లతో కొట్టుకుంటా ఊరు చివర గల గోల్గోతా కొండపై తీసుకెళ్లి శిలువకు చేతులకు మేకులు కొడుతారు. ఓ తండ్రి వీరిని క్షమించు.. వీరేమి చేస్తున్నారో వీరికే తెలియదు.. అంటూ యేసుక్రీస్తు ఏడు మాటలు మాట్లాడి ప్రాణాలు వదులుతాడు.
ప్రత్యేక ప్రార్థనలు
ఈ రోజునే క్రైస్తవులు చర్చిలకు వెళ్లి భక్తిశ్రద్ధలతో, ఆరాధాన దైవంతో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. గత నెలలో ప్రారంభమైన ఉపవాస దీక్షలు గుడ్ఫ్రైడేతో ముగుస్తుంది. మెదక్ చర్చిలో ఆదివారం ఉదయం నుంచే ప్రార్థనలు ప్రారంభమవుతాయి. యేసుక్రీస్తు మూడు గంటల పాటు శిలువపై ఉన్న సమయాన్నే, చర్చిలో మూడు గంటలపాటు దైవ సందేశాలతో ప్రార్థనలు కొనసాగుతాయి. వీటిలో ప్రధానంగా యేసుక్రీస్తు పలికిన ఏడు మాటలపైనే ప్రార్థనలు, దైవసందేశాలు కొనసాగుతాయి. ప్రభువు పలికిన ఏడు మాటలపై చర్చి ఫాస్టర్లు భక్తులకు వివరిస్తారు.
ఈస్టర్..
గుడ్ ఫ్రైడే రోజు శిలువపై అవుసులు బాసిన యేసు ప్రభువు మూడో రోజున తెల్లవారుజామున సమాధి నుంచి భక్తులకు దర్శనమిస్తాడు. కాళ్లు, చేతులకు కొట్టిన మేకుల గాయాలను చూసి గుర్తెరిగి యేసయ్య లేచి వచ్చాడని ఆనందోత్సావాలతో భక్తులు ఉప్పొంగి పోతారు. త్వరలో ఈ లోకానికి వస్తానని.. అప్పటి వరకు నేనున్నాని తెలియజేయాలని చెప్పి వెళ్లిపోతాడు. దీనినే క్రైస్తవులు ఈస్టర్ (పునరుత్థాన పండుగ) జరుపుకొంటారు. ఆదివారం తెల్లవారుజామున చర్చిలో సిలువను ఏర్పాటు చేసి చుట్టూ క్యాండిల్స్ వెలిగించి ప్రత్యేక గీతాలతో ఆరాధిస్తూ ప్రార్థనలు చేస్తారు.