దళితబంధుపై సమీక్షలో సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు
సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 12 : దళితబంధు పథకంలో భాగంగా లాభదాయకమైన యూనిట్లు ఎంపిక చేసుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించి, ప్రోత్సహించాలని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. జిల్లాలో దళితబంధు పథకం అమలుపై శనివారం కలెక్టరేట్లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళితుల పేదరికం రూపుమాపడమే దళితబంధు పథకం ఉద్దేశమన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. ఇప్పటి వరకు 444 మంది లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందన్నారు. అవసరమైన యూనిట్లకు సంబంధించి శిక్షణ ఇప్పించాలని, గ్రౌండింగ్ అయ్యేవరకు ఆయా అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. అంతకుముందు కంది మండలం ఉత్తర్పల్లి గ్రామాన్ని కలెక్టర్ దళితబంధుపై సందర్శించారు. దళితబంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమా వేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షి షా, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నేడు దళితబంధు లబ్ధిదారులకు అవగాహన సదస్సు
మెదక్, ఫిబ్రవరి 12 : దళితబంధు పథకంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదివారం మెదక్ పట్టణానికి రానున్నట్లు కలెక్టర్ హరీశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు రాందాస్ చౌరస్తాలోని జీకేఆర్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన దళితబంధు అవగాహన సదస్సులో పాల్గొని లబ్ధిదారులకు దిశానిర్దేశం చేస్తారని ఆయన తెలిపారు.