రామాయంపేట, జూలై 27 : గతంలో సమస్యలతో సతమతమైన గ్రామం. ప్రగతి పథంలో దూసుకుపోతుంది. కనీస సౌకర్యాలు లేక అల్లాడిన ప్రజలకు నేడు సకల సౌకర్యాలు ఒనగూరుతున్నాయి. గ్రామానికి వెళ్లగానే చూడముచ్చటైన రహదారులు దర్శనమిస్తాయి. పల్లె ప్రకృతి వనాలతో సరికొత్త శోభను సంతరించుకుంది. వైకుంఠధామాల నిర్మాణాలతో ఆకరి మజిలీ కష్టాలు తీరాయి. నిరంతర పారుశుధ్య పనులు, డంపింగ్ యార్డుతో గ్రామం స్వచ్ఛత దిశగా అడుగులు వేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పట్టణ ప్రగతితో మెదక్ జిల్లా, తూప్రాన్ మండలం రామాయంపేట గ్రామంలో ఊహించని మార్పు వచ్చింది.
అభివృద్ధి పనులు..
మున్సిపాలిటీలోని ప్రతి వార్డుకు న్యూ లైటింగ్ సిస్టమ్ ఉండాలని ప్రజలు చైర్మన్ను కోరగా వార్డుల్లో కొత్త స్తంభాలకు అమర్చి ఎల్ఈడీ లైటింగ్ను ఏర్పాటు చేశారు. దీంతో చీకట్లో ఉన్న రామాయంపేట పట్టణం ఇప్పుడు లైటింగ్తో జిగేల్ మంటుంది. రామాయంపేట పురప్రజల కోసం రూ.1కోటీ 50లక్షలతో అన్ని వసతులతో రెండు వైకుంఠధామాలను నిర్మిస్తున్నారు. దీంతో ఆకరి మజిలీ కష్టాలు తీరనున్నాయి. పట్టణ వాసుల చిరకాల కోరిక మల్లెచెరువు మినీ ట్యాంకుబండ్ కావడం.. వారి కోరిక మేరకు మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే, మంత్రులను కలిసి రూ.3కోట్లు నిధులను సమీకరించి మల్లెచెరువును ఓ మినీ ట్యాంకు బండ్గా నిర్మిస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు పట్టణంలోని హరిజన కాలనీ వాసుల ఉండే ఇండ్లలోకి మురి కి నీరు వచ్చి చాలా ఇబ్బందు లు పడేవారు. ప్రభుత్వం రామాయంపేట పట్టణం నుంచి సిద్దిపేట రోడ్డులో ఉన్న హరిజన కాలనీ వాసుల సంక్షేమం కోసం రూ.2కోట్లు మంజూరు చేసి సీసీ సైడ్డైన్ నిర్మాణం చేపట్టింది.
దీంతో కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువుల తయారీ కోసం రామాయంపేట శివారులో రూ.50లక్షలతో డంపుయార్డును నిర్మిస్తున్నారు. రూ.25లక్షలతో జాతీయ రహదారి పక్కనే విశాలమైన స్థలంలో యాదాద్రి పార్కు నిర్మాణానికి భూమి పూజ చేసి నిర్మాణ పనులను చేపట్టారు. ప్రభుత్వం మున్సిపల్కు మూడు ఆటోలు, మరో మూడు ట్రాక్టర్లను మంజూరు చేసింది. ప్రతి రోజు మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది ఆటోలు, ట్రాక్టర్లలో ప్రతిరోజు వార్డుల్లోని చెత్తను సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. రామాయంపేట మండలం దామరచెర్వు గ్రామానికి చెందిన మంత్రి కేటీఆర్ బంధువుల రూ.40లక్షల ఆర్థిక సాయంతో రామాయంపేట పట్టణంలోని రైతు వేదికను నిర్మించారు. దివంగత నూలి లక్ష్మి-హనుమంతరావుల పేరిట నిర్మాణం చేపట్టారు. జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా పట్టణానికి ఆనుకుని ఉన్న జాతీయ రహదారి పక్కనే 300 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. డబుల్బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.
పట్టణ అభివృద్ధ్దికి కృషి.
రామాయంపేట పురపాలికను ప్రజల సహకారంతో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. అన్ని వార్డుల్లో ఎప్పటి కప్పుడు రసాయనిక ద్రావణం పిచికారీ చేస్తున్నాం. వార్డుల్లో నాటిన మొక్కలను కాపాడేందుకు కమిటీలను ఏర్పాటు చేశాం. పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తా. ఎమ్మెల్యే సహకారంతో రామాయంపేటను ఆదర్శ మున్సిపల్గా తయారు చేసుకుంటాం.