మెదక్ మున్సిపాలిటీ/ సంగాడ్డి కలెక్టరేట్/ సిద్దిపేట అక్టోబర్ 25 : ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం 131 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు. మెదక్ జిల్లాలో 34 పరీక్షా కేంద్రాల్లో 7,211 మంది విద్యార్థులకు గానూ 6,354 మంది విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి సత్యనారాయణ తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 54 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 16,265 మంది విద్యార్థులకు గానూ, 15,130 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 24 స్కాడ్ బృందాలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశాయి. సిద్దిపేట జిల్లాలో మొత్తం 43 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, మొత్తం 12,239 మంది విద్యార్థులకు గానూ 11,113 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష జరిగింది. విద్యార్థులు శానిటైజర్ వినియోగిస్తూ, మాస్క్ ధరించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య ఆరోగ్యశాఖ ఏఎన్ఎం శానిటైజర్, మాస్క్లు, ప్రథమ చికిత్స కిట్, థర్మల్ స్కానర్లతో అందుబాటులో ఉంచి సేవలందించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేయగా, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడిపారు. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంతో పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.