మెదక్ అర్బన్, మే 20 : తెలంగాణ ప్రభుత్వం పాత 10 జిల్లాలుగా ఉన్నటువంటి కోర్టులను 33 జిల్లాల వారి జ్యుడిషియల్ కోర్టులుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ వినతి మేరకు తెలంగాణ హైకోర్టు రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేసిన 33 కొత్త రెవెన్యూ జిల్లాలను జ్యుడిషియల్ డిస్ట్రిక్స్గా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మెదక్లో నూతనంగా మెదక్ డిస్ట్రిక్ కోర్టు ఏర్పాటుచేయబోతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డిలోనే డిస్ట్రిక్ కోర్టు ఉండేది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు మెదక్, సిద్దిపేటలో కూడా నూతనంగా జిల్లా కోర్టులు ఏర్పాటు కాబోతున్నాయి. నూతనంగా ఏర్పాటు కాబోతున్న జిల్లా కోర్టులు జూన్ 2వ తేదీ నుంచి పనిచేయనున్నట్లు హైకోర్టు ఉత్తర్వులో పేర్కొంది.
ఉమ్మడి జిల్లాల వారీగా ఉన్న కేసులను ఈ నెల 24వ తేదీలోగా, కొత్త జిల్లాలకు బదిలీ చేయాలని హైకోర్టు తెలిపింది. దీంతో జూన్ 2వ తేదీ నుంచి నూతనంగా మెదక్, సిద్దిపేట జిల్లాలోని కోర్టులు జిల్లా కోర్టులుగా ఏర్పాటు కానున్నాయి. నూతనంగా జిల్లా కోర్టు ఏర్పాటు కాబోతుండటంతో మెదక్ జూనియర్ సివిల్ కోర్టు పరిధిలోకి హవేళీఘనపూర్, రామాయంపేట , నిజాంపేట, శంకరంపేట్-ఆర్, వెల్దుర్తి, చేగుంట, నార్సింగి ప్రస్తుతం ఉండేవి నూతనంగా చేర్చబడినవి తూప్రాన్, మనోహరాబాద్, పాపన్నపేట్, శంకరంపేట్-ఏ, టేక్మాల్, రేగోడ్, అల్లాదుర్గం వచ్చాయి. నర్సాపూర్ జూనియర్ సివిల్ కోర్టు పరిధిలోకి నర్సాపూర్, కౌడిపల్లి , చిలిపిచెడ్, శివ్వంపేట్, కుల్చారం వచ్చాయి. కొత్త జిల్లాలో జిల్లా కోర్టులను ఏర్పాటు చేస్తే అందుకు అవసరమైన భవనాలు, మౌలిక వసతులను కల్పిస్తామని సీఎం కేసీఆర్ న్యాయాధికారుల సమావేశంలో హామీనిచ్చిన విషయం విదితమే. దీంతో మెదక్ జిల్లా నూతనంగా జిల్లా కోర్టు ఏర్పాటు కావడంతో పాటు అల్లాదుర్గంలో శంకరంపేట-ఏ, టేక్మాల్, రేగోడ్, అల్లాదుర్గం మండలాలను కలుపుకొని అల్లాదుర్గంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కూడా ఏర్పాటు కానున్నాయి.
జిల్లా కోర్టు ఏర్పాటు కావడం శుభపరిణామం..
నూతనంగా మెదక్లో జిల్లా కోర్టుగా ఏర్పాటు కావడం శుభపరిణామం. ఇది వరకు సంగారెడ్డిలోని డిస్ట్రిక్ కోర్టుకు వెళ్లేవాళ్లం. హైకోర్టు ఉత్తర్వుల మేరకు నూతనంగా మెదక్లో జిల్లా కోర్టు ఏర్పాటు కానుండటంతో కక్షి దారులు కూడా త్వరగా కేసులకు హాజరై ఉపశమనం కలుగుతుంది. జిల్లా కోర్టు ఏర్పాటు కానుండటంతో మెదక్ జిల్లా ప్రజలకు ఆర్థిక భారం తగ్గనున్నది.
-ఎం.బాలయ్య, మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు