గజ్వేల్, సెప్టెంబర్ 27: తెలంగాణలో అమరులైన మహనీయులు కన్న కలలను సీఎం కేసీఆర్ నెరవేరుస్తున్నారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం గజ్వేల్ పట్టణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే, కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మహిళా ఎడ్యుకేషన్హబ్ వద్ద కవయిత్రి మొల్లమాంబ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కొండాలక్ష్మణ్ బాపూజీ లాంటి మహనీయులు కన్న కలలకు అనుగుణంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నదన్నారు. అన్నివర్గాల సంక్షేమానికి పోరాడిన, తెలంగాణ తొలి ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. బాపూజీ తుది కాలంలో ఆయనను కలుసుకునే భాగ్యం కలిగిందన్నారు. బాపూజీ జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని, స్వరాష్ట్రంలో ఉద్యానవన విశ్వవిద్యాలయానికి కొండాలక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టి గౌరవించుకున్నామన్నారు. చేనేత రంగంలో ప్రతిభావంతులైన కళాకారులకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులను అందజేస్తూ ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తున్నామన్నారు. త్వరలోనే నేతన్న బీమాను కూడా ప్రారంభించడానికి సీఎం కేసీఆర్ యోచనలో ఉన్నట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు.
గాంధీజీ స్ఫూర్తితో దేశ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని, ఆ విలువలను జీవితాంతం పాటిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాల్లో అన్ని దశల్లో స్ఫూర్తిగా నిలిచారన్నారు. బాపూజీ దేశం గర్వించదగ్గ గొప్ప నేత అన్నారు. అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం, సహకార రంగాల పటిష్టత కోసం జీవితమంతా కృషి చేశారన్నారు. గజ్వేల్ పద్మశాలీ భవనానికి అదనపు నిధులు కావాలని తనకు విన్నవించారని, పద్మశాలీలు కోరినట్టుగానే పద్మశాలీ ఫంక్షన్హాల్కు రోడ్డు, ఇతర మౌలిక సదుపాయాలకు రూ.50 లక్షలు మంజూరు చేసుకుని వచ్చానంటూ ఆ పత్రాలను సంఘం బాధ్యుడు శ్రీనివాస్కు అప్పగించారు. వరంగల్లో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేసి చేనేత వృత్తిని కాపాడుతున్నామన్నారు. నేతన్నల రుణాలను మాఫీ చేశామని, చేనేత మగ్గం కార్మికులను సబ్సిడీ ద్వారా ముడిసరుకును అందిస్తున్నామన్నారు. త్వరలో అందించనున్న డబుల్బెడ్రూం ఇండ్లలో అర్హులైన నిరుపేదల పద్మశాలీలకు ఇండ్లు ఇస్తామన్నారు. సొంతస్థలం ఉన్నవారికి త్వరలోనే ఇండ్లు కట్టుకునేందుకు నిధులిస్తామన్నారు.
వర్షంలోనూ ఆగని అభివృద్ధి..
ఉదయం నుంచి జోరుగా వర్షం కురుస్తున్నా మంత్రి హరీశ్రావు ఆ వర్షంలోనే గజ్వేల్ పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. గజ్వేల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ల కోసం రూ.20 లక్షలతో గజ్వేల్ ఏరియా మెడికల్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రొసీడింగ్ పత్రాలను సంఘం బాధ్యులకు అప్పగించారు. మహిళా ఎడ్యుకేషన్ హబ్ వద్ద కవయిత్రి మొల్ల విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం కుమ్మరి సంఘం అభివృద్ధికి రూ.25 లక్షల రూపాయల ప్రొసీడింగ్ పత్రాలను సభ్యులకు అందజేశారు. అనంతరం హౌసింగ్ బోర్డులో రూ.50 లక్షలతో కమ్యునిటీహాల్, మరో రూ.50 లక్షలతో అంబేద్కర్ సంఘం భవన సముదాయం నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. సంబంధిత పనులకు ప్రొడీసింగ్ పత్రాలకు బాధ్యులకు అప్పగించారు. కార్యక్రమంలో సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణశర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జకియోద్దీన్, ఏఎంసీ చైర్పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ పంగమల్లేశం, సీనియర్ నాయకులు మాదాసు శ్రీనివాస్, డాక్టర్ యాదవరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, కౌన్సిలర్లు, సర్పంచ్లు, పార్టీ నాయకులు, పద్మశాలీ, కుమ్మర, కెమిస్ట్, డ్రగ్గిస్ట్, అంబేద్కర్ సంఘాల నాయకులు, టీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.