సిటీబ్యూరో, జూన్ 4(నమస్తే తెలంగాణ): నిత్యం హోంవర్క్తో పాటు టెక్ట్స్ బుక్స్ చదువుతూ అకడమిక్ పుస్తకాలను చదివిన విద్యార్థులు, ఎండకాలం సెలవులు రావడంతో వాటిని అల్మారాలకే పరిమితం చేశారు. సమ్మర్ వెకేషన్లో కథల పుస్తకాలతో పాటు ముఖ్యంగా చిల్డ్రన్ స్టోరీస్ బుక్స్తో వినూత్న కథలను చదువుతున్నారు. తమ పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందించడానికి తల్లిదండ్రులు సైతం కథల పుస్తకాలను చదివించేందుకు శ్రద్ధ చూపుతున్నారు. తమ బాల్యంలో తాత, నాయనమ్మ ద్వారా నేర్చుకున్న సామెతలు, పొడుపు కథలతో పాటు నైతిక విలువలు నేర్పే అనేక రకాల విషయాలను తెలుసుకున్నామని కొందరు తల్లిదండ్రులు చెబుతున్నారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా రాసిన పుస్తకాలను కొనుగోలు చేసి బాల్యానికి కమ్మని కథలను అందిస్తున్నారు.
ఒకప్పుడు చిన్న పిల్లలకు తాతలు, అవ్వలు నిద్రపోయేటప్పుడు కథలు చెప్పేవారు. మంచి, చెడు చెప్పే ఆ నీతి కథలు పిల్లలపై ఎంతో ప్రభావం చూపేవి. ఆ విధంగానే సమాజంలో మెలిగేది. కానీ, ప్రస్తుతం పరిస్థితులు మారాయి. తాత, అవ్వ దగ్గర ఎవరూ ఉండడం లేదు. ఉమ్మడి కుటుంబాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఉద్యోగాలు, ఇతర అవసరాలకు పట్టణాలకు వచ్చేస్తున్న వారి సంఖ్య ఎకువగా ఉంది. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులే చిన్నారులకు కథలు చెప్పే బాధ్యత తీసుకుంటున్నారు. బొమ్మలతో కూడిన కథల పుస్తకాలు చిన్నారులు ఆసక్తిగా చదివేందుకు అనువుగా ఉంటాయి. పిల్లలకు నీతి కథలు చెప్పడం ఎంతో ముఖ్యం. వీటితోనే వారికి చిన్నతనం నుంచే మంచి, చెడు తెలుస్తాయి. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. వినోదంతో పాటు మంచిని బోధిస్తే భవిష్యత్తును తమకు తాముగా తీర్చిదిద్దుకునే ఆలోచనా విధానాన్ని పెంచుకునేందుకు పుస్తక పఠనం దోహదపడుతుంది.
చిల్డ్రన్స్ షార్ట్ స్టోరీస్ కోసం ఆంగ్లంలో అనేక రచనలు ఉన్నాయి. ఇందులో సుధామూర్తి రచించిన హౌ ఐ టీచ్ మై గ్రాండ్ మదర్, ది మ్యాజిక్ ఆఫ్ ది లాస్ట్ టెంపుల్, త్రీ థౌసెండ్ స్టిచెస్ లాంటి షార్ట్ స్టోరీస్ బుక్స్ చిన్నారులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. రస్కిన్ బాండ్ రాసిన ది బ్ల్యూ అంబ్రెల్లా, ది రూం ఆన్ ది రూఫ్, ది విష్లింగ్ స్కూల్ బాయ్, డస్ట్ ఆన్ ది మౌంటెయిన్, ది విండ్ ఆన్ ది హౌంటెడ్ హిల్ లాంటి ప్రఖ్యాత రచనలు కమ్మని కథలను వినడానికి, చదవడానికి ముందు వరుసలో ఉన్నాయి. ఇవేకాకుండా అనేక భారతీయ భాషల్లోనూ చిన్నారులను ఆలోచింపజేసే, నీతి సారాన్ని బోధించే అంశాలతో కూడిన కథలు అందుబాటులో ఉన్నాయి.
చిన్నారులకు కథల పుస్తకాలు తెలుగులో అనేకం ఉన్నాయి. సరస్వతీ నమస్తుభ్యం, కథ చెబుతా ఊ కొడతావా, బంగారు కల, నిజమే మాట్లాడు, పిచ్చుక చేతికి బంగారు పంట, లోభి, జాతరలో కోతిబావ, చీమా చీమా ఎందుకేడ్చావ్ లాంటి అనేక పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అనేక పుస్తకాలు బొమ్మలతో కూడిన చిన్న చిన్న కథల బుక్స్ను చదివేస్తున్నారు. తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేయడానికి చిన్నారులు, వారి తల్లిదండ్రులు నగరంలోని పుస్తక కేంద్రాలకు వెళ్లి మరీ వెతుక్కుంటున్నారు. తరుచుగా వివిధ బుక్ స్టాల్స్ను సందర్శిస్తున్నారు.