మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి
దుబ్బాకలో లాటరీ ద్వారా 589 డబుల్ ఇండ్ల కేటాయింపు
దుబ్బాక టౌన్, ఫిబ్రవరి 16 : పైసా ఖర్చు లేకుండా పేదోళ్లకు డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇవ్వడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పట్టణంలో నిర్మించిన ఇండ్లలో 589 ఇండ్లను ఎమ్మెల్యేతో కలిసి లాటరీ పద్ధతిన లబ్ధిదారులకు కేటాయించారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడారు. ఇండ్లు లేని పేదలకు పారదర్శకంగా కేటాయించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదన్నారు. నేడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు అధికారుల సమక్షంలో అందజేస్తున్నామన్నారు. దుబ్బాక పట్టణంలో మిగిలిన ఇండ్లను వచ్చే నెలలో ఇస్తామన్నారు. వచ్చే మార్చిలో దుబ్బాకలో సీఎం కేసీఆర్ పర్యటించే అవకాశముందని, దుబ్బాకలో ఆధునికంగా నిర్మించిన పాఠశాల ప్రారంభోత్సవంతో పాటు డబుల్బెడ్ రూం ఇండ్లను ప్రారంభించనున్నట్లు ఎంపీ తెలిపారు. ఈ నెల 23న మల్లన్నసాగర్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ రానున్నారని, తొగుటలో జరిగే బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, టీఆర్ఎస్ అభిమానులు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని ఎంపీ కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రఫూల్దేశాయ్, ఆర్డీవో అనంతరెడ్డి, డీఆర్డీవో పీడీ గోపాల్రావు, తహసీల్దార్ సలీం, మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితాభూంరెడ్డి, కమిషనర్ గణేశ్రెడ్డి, వైస్ చైర్పర్సన్ సుగుణ, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
దౌల్తాబాద్ మండలంలో 72 ఇండ్లు..
దౌల్తాబాద్, ఫిబ్రవరి 16 : మండలంలో 72 డబుల్ బెడ్రూం ఇండ్లను లాటరీ ద్వారా లబ్ధిదారులకు అందజేశారు. బుధవారం తహసీల్దార్ బాల్రాజ్ ఆధ్వర్యంలో శౌరీపూర్లో 11, సూరంపల్లిలో 21, దొమ్మాటలో 40 డబుల్ బెడ్రూం ఇండ్లకు లాటరీ తీశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగధరి సంధ్య, జడ్పీటీసీ రణంజ్యోతి, ఎంపీడీవో మచ్చేందర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సోలిపేట సతీశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.