న్యాల్కల్, జూలై 27: “సిద్ధివినాయక మహరాజ్కీ జై..” అంటూ మంగళవారం రేజింతల్ సిద్ధివినాయక ఆలయం మార్మోగింది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి కూడా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. స్వామివారికి ఇష్టమైన, సంవత్సరానికి రెండు సార్లు మంగళవారం వచ్చే పవిత్రమైన అంగాకర సంకష్టహర చతుర్థిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు స్వామివారికి అభిషేకం, కుంకుమార్చన, హోమం, హారతి తదితర పూజలను వైభవంగా నిర్వహించారు. వేడుకల సందర్భంగా నిర్వాహకులు ఆలయ గర్భగుడి, స్వామివారిని రంగురంగుల విద్యుత్ దీపాలు, పండ్లు, పూలతో అందంగా అలంకరించారు. అంగరక సంకష్టహర చతుర్థి వేడుకలకు జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలను నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. జహీరాబాద్, బీదర్, నారాయణఖేడ్, జోగిపేట్, మనూర్, సంగారెడ్డి, సదాశివపేట్, ఝరాసంగం, రాయికోడ్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పాదయాత్రతో తరలిరావడంతో జహీరాబాద్, బీదర్, అల్లాదుర్గం వెళ్లే రోడ్డు మార్గాలు కిక్కిరిసిపోయాయి.
పాదయాత్రతో వస్తున్న భక్తులకు మండల భజరంగ్దళ్, వీహెచ్పీ శాఖతో పలువురు దాతలు టెంట్లు వేసి టిఫిన్, పండ్లు, అన్నదానం అందజేశారు. కొవిడ్ నిబంధన మేరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన భజన మండలి సభ్యులు చేసిన భజన కీర్తనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో సిద్ధి,బుద్ధి సమేత వినాయకుడి కల్యాణం కన్నుల పండువుగా నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ ఊరేగింపు చేపట్టారు. జహీరాబాద్ డీఎస్పీ శంకర్రాజ్ ఆధర్యంలో జహీరాబాద్ పట్టణ సీఐ రాజశేఖర్, జహీరాబాద్ రూరల్ నాగేశ్వర్రావు, హద్నూర్ వినయ్కుమార్ పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు.
స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు..
రేజింత్ సిద్ధివినాయక వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్పాటిల్, ఆత్మ చైర్మన్ విజయ్కుమార్, భజరంగ్దళ్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాశ్ చందర్, రాష్ట్ర మాజీ డీజీపీ అనురాగ్శర్మ దంపతులు, మండల తహసీల్దార్ రాధాబాయి, ఎంపీడీవో జగదీశ్వర్, సర్పంచులు మారుతీయాదవ్, మల్లారెడ్డి, వీరమణి, ఎంపీటీసీ దేశెట్టిపాటిల్, పలు పార్టీల నాయకులు మంకాళ్ సుభాష్, నర్సింహారెడ్డి, రవీందర్, భాస్కర్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, రాజ్కుమార్, ప్రవీణ్కుమార్, ఏక్నాథ్రావుపాటిల్, విశ్వనాథ్, ఓంకర్, మల్లేశం తదితరులు స్వామివారిని ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రేజింతల్ సంగయ్య, ప్రధాన కార్యదర్శి అల్లాడి నర్సిములు, ఉపాధ్యక్షుడు రమేష్, కోశాధికారి నీల రాజేశ్వర్, సెక్రటరీ ఉల్లిగడ్డ బస్వరాజ్, సంయుక్త కార్యదర్శులు చిద్రిలక్ష్మణ్, దిగంబర్పోలా, సభ్యులు అల్లాడి వీరేశం, గణేశ్దీక్షిత్, కొబ్బజీ రవికుమార్, కల్వ చంద్రశేఖర్, సిద్ధప్ప, దేవిదాస్ కులకర్ణి, రాజేశ్వర్, రాజ్కుమార్, ఆశోక్, మేనేజర్ కృష్ణ, వేదపండితులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.